కవాడిగూడ, మే 4: మాదిగలు, నేతకాని, బీసీలంతా ఏకమై ఈ లోక్సభ ఎన్నికల్లో కాం గ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలోనే మాదిగలకు తీరని అన్యాయం జరిగిందని, ఏ ఒక్క మాదిగ బిడ్డ కూడా ఆ పార్టీకి ఓటేయొద్దని హితవు పలికారు. లోక్సభ ఎన్నికల్లో మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ అవమానించడాన్ని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నా చౌక్ లో మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని, బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ తదితరులు హా జరయ్యారు. మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. కాంగ్రెస్ జైపూర్ నియమావళికి విరుద్ధంగా రేవంత్రెడ్డి ఓ సామాజికవర్గంతో కుమ్మక్కై ఒకే కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ సీట్లు కేటాయించారని, 80 శాతం ఉన్న మాదిగలకు మాత్రం ఒక్క సీటు కూడా కేటాయించలేదని ధ్వజమెత్తారు.
సీఎం రేవంత్రెడ్డి వైఖరితో మాదిగలకు తీవ్ర అన్యాయం జరిగిందని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కన్నీటి పర్యంతమయ్యారు. చరిత్రలో ఏ పార్టీ చేయని అన్యా యం కాంగ్రెస్ పార్టీ చేసిందని విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేశ్, కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి వంశీ తిలక్, ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు రాగటి సత్యం, తిప్పారపు లక్ష్మణ్మాదిగ, సూరన్న మాదిగ, గోపాల్, నరసింహ, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.