సిద్దిపేట, అక్టోబర్ 22 : బ్యాంకులు ఇచ్చే రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని సిద్దిపేట డీఆర్డీవో గోపాల్రావు, ఎస్బీఐ డీజీఎం సత్యనారాయణపాణిగ్రహి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం సిద్దిపేటలోని కొండా భూదేవి గార్డెన్లో లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో రుణ విస్తరణ మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా 25 బ్యాంకులకు గాను 23 బ్యాంకులు ప్రత్యేకంగా స్టాల్స్ను ఏర్పాటు చేశాయి. వీటితో పాటు ఐకేపీ, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మెప్మా ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న రుణాలను తక్కువ వడ్డీకే పొంది పేద, మధ్య తరగతి కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలన్నారు. రైతులు వాణిజ్య పంటల సాగువైపు మొగ్గుచూపాలని, నాబార్డు ద్వారా వ్యవసాయ పరికరాలను సబ్సిడీపై అందిస్తున్నట్లు తెలిపారు. రుణాల విస్తరణ కోసం రూ.138 కోట్లు కేటాయించినట్లు లీడ్ బ్యాంకు మేనేజర్ లక్ష్మీప్రసాద్ తెలిపారు. మహిళా సంఘాలకు రూ.92 కోట్లు కేటాయించామన్నారు. యూనియన్ బ్యాంకు ద్వారా ఉచిత ఉపాధి శిక్షణ తీసుకున్న యువతకు వారు ఎంచుకున్న యూనిట్లకు రుణ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఆయా బ్యాంకులు ఏర్పాటు చేసిన స్టాళ్లలో ప్రజలు రుణాలు, వివిధ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ రుణ విస్తరణ మహోత్సవానికి సిద్దిపేట జిల్లాకు చెందిన 1500 మంది హాజరై తమ దరఖాస్తులను అందజేసినట్లు లీడ్ బ్యాంకు మేనేజర్ లక్ష్మీప్రసాద్ తెలిపారు. యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా రీజినల్ అధికారి శంకర్లాల్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలైన పీఎం సురక్ష బీమా యోజన, జీవన జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పథకాల్లో బీమా సౌకర్యం పొందాలన్నారు. అన్ని బ్యాంకులు కలిపి 112 శాతం సీడీరేషియో సాధించి బ్యాంకులు సేకరించిన డిపాజిట్ల కంటే రుణాలు రెట్టింపు శాతం అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రావణ్కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామాచారి, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి సరోజ, సెరికల్చర్ అధికారి ఇం ద్రసేనారెడ్డి, యూనియన్ రిస్టి డైరెక్టర్ శ్రీనివాస్రావు పలువురు అధికారులు పాల్గొన్నారు.