సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 20 : జిల్లాలో వివిధ దశల్లో ప్రగతిలో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను త్వరగా పూర్తి చేయాలని సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాలో డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ, మౌలిక సదుపాయాల కల్పనపై రెవెన్యూ డివిజన్ అధికారులు, రహదారులు, భవనాలు, ఈడబ్ల్యూడీసీ, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ పర్యవేక్షక, కార్యనిర్వాహక ఇంజినీర్లు, అన్ని మండలాల ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లతో ఐడీవోసీలో కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. మొత్తం జిల్లాలో ఇప్పటికే 4037 ఇండ్లు ఇండ్లులేని నిరుపేదలకు కేటాయించగా, 5504 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మా ణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. 2994 ఇండ్లు వివిధ దశల్లో ప్రగతిలో ఉన్నాయన్నారు. ప్రారంభానికి సిద్ధం గా ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లలో విద్యుత్, తాగునీరు, రోడ్లు తదితర ఇన్ఫాస్ట్రక్చర్ గ్యాప్ లేకుండా చూడాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం చేస్తే గుత్తేదారులను తప్పించి బాగా చేసే కాంట్రాక్టర్లకు అప్పగించాలని కలెక్టర్ ఆదేశించారు. పెండి ంగ్లో ఉన్న ఇండ్లకు లబ్ధిదారుల ఎంపికను వచ్చే 3 వారాల్లో పూర్తి చేయాలన్నారు.
ఫిర్యాదులను పరిష్కరించాలి..
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుందామని కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీవోసీ మీటింగ్హాల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి వినతులను అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్, ట్రైనీ కలెక్టర్ ప్రఫూల్దేశాయి, డీఆర్వో చెన్నయ్య స్వీకరించారు. మొత్తం 122 పైగా వినతులు రాగా, వివిధ ప్రాంతాల నుంచి భూసంబంధిత సమస్య లు 74వినతులు వచ్చాయి. వీటిని ఆయా డివిజన్ల పరిధిలోని ఆర్డీవోలు పరిష్కరించేందుకు చొరవ చూపాలని కలెక్టర్ ఆదేశించారు. ఇతరత్రా సమస్యల పరిష్కారానికి 48 ఫిర్యాదులు రాగా కలెక్టర్, అదనపు కలెక్టర్, డీఆర్వో అక్కడికక్కడే పరిష్కరించారు. వచ్చే ప్రజావాణి నుంచి ప్రతి అర్జీదారుడికి రసీదు ఇవ్వాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.