బన్సీలాల్పేట్ : పేద ప్రజల కోసం ప్రభుత్వం ఉచితంగా నిర్మించి ఇస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.
సోమవారం సనత్నగర్ నియోజకవర్గం పరిధిలోని బన్సీలాల్పేట్ డివిజన్ చాచానెహ్రూనగర్లో నిర్మించిన 264 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేసేందుకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు చేపట్టిన ప్రత్యేక బస్తీ సభలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఎలాంటి విమర్శలకు ఆస్కారం లేకుండ బస్తీ ప్రజల అందరి సమక్షంలోనే అర్హులను గుర్తించి ఇండ్లను కేటాయించడం జరుగుతున్నదని స్పష్టం చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కలెక్టర్ శర్మన్ల సమక్షంలో అధికారులు లబ్ధిదారులను ఒక్కొక్కరిగా పేర్లతో పిలిచి ఇతను మీ బస్తీ వాసేనా అని స్థానిక ప్రజలను అడిగి అర్హుడిగా నిర్ధారణ చేశారు.
బస్తీలో నివసించే అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇండ్లు కేటాయిస్తామని మంత్రి ప్రకటించారు. లబ్ధిదారులపై ఒక్క పైసా భారం పడకుండ దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రభుత్వమే ఉచితంగ ఇండ్లను నిర్మించి ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలత, సికింద్రాబాద్ ఆర్డీవో వసంతకుమారి, తహసీల్దార్ బాలశంకర్, హౌసింగ్ ఈఈ వెంకట్దాస్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు జీ.పవన్కుమార్గౌడ్, కే.లక్ష్మిపతి, బస్తీ అధ్యక్షుడు అచ్చా నర్సింగ్రావు, డి.సుదర్శన్బాబు, వై.సురేశ్కుమార్, విజయ్శంకర్, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఎంపిక ప్రక్రియ పట్ల స్థానికుల హర్షం
అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం అధికారులు చేపట్టిన ఎంపిక ప్రక్రియ పట్ల బస్తీవాసులు హర్షం ప్రకటించారు. గతంలో ఎన్నడు కూడా ఇంత బాగా జరగలేదని, వారికి నచ్చిన వారికి ఇండ్లను కేటాయించుకునే వారన్నారు. ఇప్పుడు మాత్రం బస్తీవాసుల సమక్షంలో ప్రతి ఒక్కరిని వేదికపైకి పిలిచి అందరూ అంగీకారం తెలిపితేనే ఇల్లు కేటాయించడం అనే పద్దతి చాలా బాగుందని ప్రశంసించారు.
అభ్యంతరాలను, రద్దు చేసిన వారి పేర్లు, కారణాలతో సహా జాబితాలను నోటిసు బోర్డులపై పెట్టేశారు. అలాగే, ఎంపిక చేసిన అర్హులైన లబ్ధిదారుల జాబితా కూడా సర్వే అనంతరం ప్రజల సమక్షంలో ప్రదర్శించి, నోటిసు బోర్డులో పెడతామని అధికారులు తెలిపారు.