సంగారెడ్డి, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం మద్యం దుకాణాలు(ఏ-4) లైసెన్స్ దుకాణాల లైసెన్స్ను నెలరోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 193 మద్యం దుకాణాల లైసెన్స్ గడువు అక్టోబర్ 31తో ముగియనున్నది. రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాల లైసెన్స్ నెలపాటు పొడిగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలోని దుకాణాల లైసెన్స్ల గడువు నవంబర్ 30 వరకు కొనసాగనున్నది. ప్రభుత్వం నిర్ణయంపై వైన్స్ల నిర్వాహకుల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 193 మద్యం దుకాణాలున్నాయి. సంగారెడ్డి జిల్లాలో 85 మద్యం దుకాణాలు(ఏ-4), సిద్దిపేటలో 70, మెదక్లో 38 వైన్స్లు ఉన్నాయి. 2019-21 సంవత్సరానికి గానూ రెండేండ్ల పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని 193 మద్యం దుకాణాల నిర్వహణకు 2019 నవంబర్లో ఎక్సైజ్ శాఖ అధికారులు లైసెన్స్లు జారీచేశారు. ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని అనుసరించి లాటరీ పద్ధతిలో ఉమ్మడి జిల్లాలో వైన్స్లను కేటాయించింది. వైన్స్లు దక్కించుకున్న వ్యాపారులు నిబంధనలను అనుసరించి 2019 అక్టోబర్ 1 నుంచి అమ్మకాలు ప్రారంభించారు. ఈ ఏడాది నవంబర్తో మద్యం దుకాణాల లైసెన్స్ గడువు ముగియనున్నది.
కరోనాతో మూసివేత..
కరోనా తీవ్రత నేపథ్యంలో గతేడాది ప్రభుత్వం వైన్స్లను మూసివేయగా, ఉమ్మడి మెదక్ జిల్లాలో సుమారు 45 రోజుల పాటు వైన్స్లు తెరుచుకోలేదు. దీంతో ఆర్థికంగా నష్టపో యామని, తమ లైసెన్స్ గడువు పెంచాలని వైన్స్ల నిర్వాహకులు ప్రభుత్వాన్ని కోరారు. వారి విన్నపం మేరకు ప్రభుత్వం, వైన్స్ల లైసెన్స్ గడువును నెలరోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ నిర్ణయంపై వైన్షాపుల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రభుత్వం నెల పాటు లైసెన్స్ గడువు పొడిగించిన నేపథ్యంలో ఎంత మేరు ఫీజు వసూలు చేస్తుంది? లైసెన్స్ ఫీజు వసూలు చేస్తారా? లేదా? అన్నదానిపై స్పష్టత లేదని ఎక్సైజ్ అధికారులు అంటున్నారు. త్వరలోనే స్పష్టమైన ఉత్తర్వులు జారీ కావచ్చని పేర్కొంటున్నారు. 2021-23 సంవత్సరానికి వైన్స్, బార్షాప్ల నూతన విధివిధానాల తయారీలో రాష్ట్ర ఎక్సైజ్శాఖ నిమగ్నమైనట్లు తెలుస్తోంది.
నూతన మద్యం పాలసీకి ఎదురుచూపులు..
నూతన మద్యం పాలసీ కోసం వైన్స్ల నిర్వాహకులు ఎదురుచూస్తున్నారు. మద్యం దుకాణాల లైసెన్స్ గడువు నవంబర్30 వరకు పొడిగించిన నేపథ్యంలో డిసెంబర్లో కొత్త మద్యం దుకాణాలను నోటిఫై చేసే అవకాశం ఉంటుందని వైన్స్ల నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఇటీవలే మద్యం దుకాణాల కేటాయింపులో గౌడ కులస్తులకు 15శాతం, ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు ప్రకటించగా, వారు కూడా ఎదురుచూస్తున్నారు. దీంతో ప్రభుత్వం మద్యం దుకాణాలు కేటాయించే సమయంలో రిజర్వేషన్లు అమలు చేస్తుందని, అప్పుడు తమకు వైన్షాపులు దక్కుతాయని గౌడ, ఎస్సీ, ఎస్టీలు సంతోషంగా ఉన్నారు. దీంతో ప్రభుత్వం ప్రకటించే కొత్త పాలసీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పాలసీ ప్రకటిస్తే ఉమ్మడి జిల్లాలో వైన్స్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.