మన్సూరాబాద్ : వీరన్నగుట్ట శివాలయం అభివృద్ధికోసం రూ. 10 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ హయత్నగర్ పరిధి వీరన్నగుట్టలోని పురాతన స్వయం భూ శివాలయాన్ని ఆదివారం మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయం చుట్టూరా ఉన్న ఆరు ఎకరాల స్థలంలో ఆద్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా నిర్మాణాలు చేస్తామని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో అతి పెద్ద దివ్యక్షేత్రంగా వీరన్నగుట్ట శివాలయం అభివృద్ధి చెందనుందని ఆయన పేర్కొన్నారు.
మహా శివరాత్రికి లక్షలాది మంది వచ్చి మహాశివుడిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఆలయ పరిసరాలలో రాక్గార్డెన్ నిర్మిస్తామని, అదేవిధంగా స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం విశాలమైన పార్కింగ్ సదుపాయం కల్పిస్తామని ఆయన తెలిపారు. గుట్టపైకి కాలి నడకన చేరుకునేందుకు అధునాతమైన రోడ్లను వేస్తామని తెలిపారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎంఆర్ఓతో మాట్లాడి త్వరలో గుడి చుట్టూ సరిహద్దులను ఏర్పాటు చేసి ప్రహారీగోడలను నిర్మించి ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చూస్తామని ఆయన పేర్కొన్నారు. భక్తుల స్నానాల కోసం గుట్టపైన కోనేరు నిర్మాణం చేపడుతామని తెలిపారు. వీరన్నగుట్ట రూపురేఖలను మార్చి అతి పెద్ద పుణ్యక్షేత్రంగా మార్చడమే తన లక్ష్యమని ఆయన తెలిపారు.