డీఆర్డీవో కృష్ణన్
మోమిన్పేట, ఏప్రిల్ 17 : అనంతగిరి రైతు కూరగాయల ఉత్పత్తిదారుల కేంద్రం నుంచి ఉల్లిగడ్డ కొనుగోలును ప్రారంభించాలని డీఆర్డీవో కృష్ణన్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని అనంతగిరి రైతు కూరగాయల ఉత్పత్తిదారుల కేంద్రంలో కేంద్ర సిబ్బంది, నవాబుపేట వీఎల్పీసీ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలో ఉల్లిగడ్డ సాగు చేస్తున్న రైతుల వివరాలు సేకరించి వారు పండించిన పంటను అనంతగిరి కేంద్రంలో విక్రయించేలా రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. మార్కెట్ ధరలకు అనుగుణంగా ఉల్లిగడ్డకు మద్దతు ధర కిలో రూ.9 నుంచి 12 వరకు ఇక్కడ కల్పిస్తామని సూచించారు. మండలంలోని చిన్న, సన్నకారు రైతులను అనంతగిరి కేంద్రంలో సభ్యులుగా చేరేందుకు అవగాహన కల్పించాలని తెలిపారు. రైతులకు కావలసిన కూరగాయల నారును కావలసిన సమయానికి అందుబాటులో ఉండేలా సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు సాగు చేసిన కూరగాయలకు అనంతగిరి కేంద్రంలో మంచి మద్దతు ధర కల్పిస్తారని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీవో నర్సింహులు, డీపీఎం శ్రీనివాస్, ఏపీవో శివ, సీఈవో రవి, సీసీలు, కేంద్రం అధ్యక్షురాలు లక్ష్మి, ఉపాధ్యక్షురాలు ప్రమీల, నవాబుపేట వీఎల్పీసీ సిబ్బంది పాల్గొన్నారు.
వైకుంఠధామం నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలి
మర్పల్లి, ఏప్రిల్ 17 : వైకుంఠధామం నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని డీఆర్డీవో కృష్ణన్ అన్నారు. శనివారం మండల పరిధిలోని సిరిపురం, వీర్లపల్లి గ్రామాల్లో నిర్మిస్తున్న వైకుంఠధామం నిర్మాణ పనులను, నర్సరీలను, ఉపాధి హామీ పనులను ఏపీవో అంజిరెడ్డితో కలిసి సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ను ఆదేశించారు. సిరిపురంలోని చామకూర గోపాల్ పొలం వద్ద పండిస్తున్న గడ్డి పెంపకం గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు మల్లయ్య, సుధాకర్రెడ్డి, సీసీ విఠల్, టీఏ భాస్కర్, పంచాయతీ కార్యదర్శి మల్లయ్య పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికర లాభం ఎంతంటే?
రూ.14 వేల కోట్ల ప్రభుత్వ సెక్యూరిటీల వేలం రద్దు