కమాన్చౌరస్తా, మార్చి 30: ‘కామర్స్’తో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని, రాబోయే రోజుల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగనున్నాయని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్, ప్రొఫెసర్ లింబాద్రి పేర్కొన్నారు. ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులంతా ఎక్కువగా కామర్స్ రంగాన్నే ఎంచుకుంటున్నారని చెప్పారు. శాతవాహన యూనివర్సిటీ కామర్స్ విభాగంలో తెలంగాణ కామర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘ఇంపాక్ట్ ఆఫ్ కొవిడ్ ఆన్ బిజినెస్ అండ్ ఇండస్ట్రీ’ అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ కామర్స్ అసోసియేషన్ చేస్తున్న వివిధ కార్యక్రమాలను ప్రశంసించి మాట్లాడారు. శాతవాహన యూనివర్సిటీ 12 బీ అర్హత సాధించడంపై ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం సమావేశానికి అధ్యక్షత వహించిన ఎస్యూ ఉపకులపతి ఎస్ మల్లేశం మాట్లాడారు. శాతవాహనలో జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేసిన ఆయన, విద్యార్థులందరూ తమ వ్యక్తిగత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. తెలంగాణ కామర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, కేరళ కేంద్ర విశ్వవిద్యాలయం ఉప కులపతి హెచ్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, కామర్స్ విభాగం విశిష్టత, వివిధ ఉపాధి అవకాశాలు, తెలంగాణ అసోసియేషన్ చేస్తున్న వివిధ కార్యక్రమాలను వివరించారు. టీసీఏ కార్యదర్శి ప్రొఫెసర్ డీ చెన్నప్ప మాట్లాడుతూ, కరోనాతో సమాజంలోని వివిధ రంగాలపై తీవ్ర ప్రభావం ఉన్నదని, మరీ ముఖ్యంగా పరిశ్రమలు, వ్యాపార రంగాలకు కోలుకోని దెబ్బ తగిలిందని చెప్పారు. ఎస్యూ ఓఎస్డీ టూ వీసీ రమేశ్, తెలంగాణ ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ మాట్లాడుతూ, తెలంగాణ కామర్స్ అసోసియేషన్ కార్యక్రమాలను ప్రశంసించారు. శాతవాహన యూనివర్సిటీ కామర్స్ విభాగాధిపతి, జాతీయ సదస్సు సెక్రటరీ హరికాంత్ మాట్లాడుతూ, పరిశ్రమలపై, వ్యాపార రంగంపై కరోనా ప్రభావం తీవ్రంగా పడ్డదని, ఆ సమయంలో విద్యార్థులూ పడ్డ ఇబ్బందులను వివరించారు. అనంతరం తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ కామర్స్ ప్రొఫెసర్లైన నరసింహ మూర్తి, రాజేశం, రాజిరెడ్డి, రఘువీర్లను సన్మానించారు. వర్తక రంగం, విద్యా రంగం, మ్యానుఫ్యాక్చరింగ్ ఈ రంగంపై కరోనా ప్రభావం అనే మూడు అంశాలపై టెక్నికల్ సెషన్ నిర్వహించారు. వీటిపై పరిశోధక విద్యార్థులు, అధ్యాపకులు చేసిన పరిశోధన పత్రాలను సమర్పించారు. కార్యక్రమంలో ఎస్యూ రిజిస్ట్రార్ వరప్రసాద్, అధ్యాపకులు, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.