అమీర్పేట్ : వైదిక ధర్మాన్ని పరిరక్షించడంలో తమ పిల్లలు భాగస్వాములయ్యేలా చూడాలని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. ప్రతి బ్రాహ్మణుడు తమ కుటుంబంలో కనీసం ఒక్క వ్యక్తి అయినా వైదిక ఆచారాలను పాటించే వారిగా తీర్చిదిద్దాతామని ప్రతిజ్ఞబూనాలని పిలుపునిచ్చారు.
భారతీయులపై పాశ్చాత్య ప్రభావం బాగా పడిందని, తమ కట్టు బొట్టు ఆచార వ్యవహారాలకు దూరమవుతున్నారన్నారు. ఆ విధంగా వారసత్వం సంప్రదాయాలను ముందు తరానికి అందించలేని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షులు వెల్లాల రామ్మోహన్ ఆధ్వర్యంలో ఆదివారం సనత్నగర్లోని హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో కార్తీక వన సమారాధన జరిగింది.
ఈ కార్యక్రమానికి హాజరైన చినజీయర్ స్వామి వేలాదిగా తరలివచ్చిన బ్రాహ్మణ సమాజాలకు చెందిన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ మన సంప్రదాయ ఆచార వ్యవహారాలను కాపాడుకునే గురుతర బాధ్యత ప్రతి బ్రాహ్మణ కుటుంబంపై ఉందన్నారు.
బతుకుదెరువుకై తమ పిల్లలకు చక్కటి మార్గ దర్శకాన్ని చేస్తుండే తల్లిదండ్రులు.. వారసత్వ సంప్రదాయాలను ముందు తరానికి అందించేందుకు వీలుగా తమ సంతానంలో కనీసం ఒక్కరినైనా దేశాన్ని రక్షించేందుకు సరిహద్దుల్లో సైనికులు శస్త్రధారులై ఉంటుంటే.. దేశంలో ప్రజానీకాన్ని కాపాడేందుకు బ్రాహ్మణులు శాస్త్రధారులై ఉంటారన్నారు. బ్రాహ్మణులు అంతటి శక్తివంతులన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఢిల్లీలో తెలంగాణ అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్.వేణుగోపాలచారి, మాజీఎమ్మెల్సీ ఎం.రామచంద్రరావు, బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ప్రతినిధులు జి.విజయలక్ష్మి, పంచ గంగేశ్వర్, ఎం.వి.శాస్త్రి తదితరులు హాజరయ్యారు.