ఆరునూరైనా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు పూర్తి చేసి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను సస్యశ్యామలం చేసి తీరుతామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రంలో వలసల జిల్లాగా ఉన్న పాలమూరులో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహించుకున్నారనే సమాచారం మేరకు టీఆర్ఎస్ అభ్యర్థులు కశిరెడ్డి, కూచకుళ్లతో కలిసి మహబూబ్నగర్ కలెక్టరేట్కు వచ్చిన మంత్రి గురువారం మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్కు పాలమూరుపై ఎంతో అభిమానం ఉందన్నారు. అందుకే పాలమూరును రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సమర్థులైనందునే సీఎం కేసీఆర్ మరోసారి కశిరెడ్డి, కూచకుళ్లకు పోటీ చేసే అవకాశం కల్పించారన్నారు. స్థానిక సంస్థల ఓటర్లు అత్యధికులు టీఆర్ఎస్ పార్టీ వారే కావడంతో తమ గెలుపు నల్లేరుమీద నడకే అని ముందే తెలుసని అన్నారు. స్వతంత్రులు సైతం పోటీ నుంచి తప్పుకోవడంతో ఎన్నికలు జరపాల్సిన అవసరమే లేకుండా పోయిందన్నారు. ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్మన్గా దామోదర్రెడ్డికి, విద్యావేత్తగా కశిరెడ్డికి ఎంతో అనుభవం ఉందని.. అది ఉమ్మడి జిల్లా అభివృద్ధికి ఉపయోగపడుతుందన్నారు. ఎమ్మెల్సీ బరిలో ఉంటాడని భావించిన గాయకుడు సాయిచంద్కు ఆయన రంగానికి సంబంధించిన అంశంలో సీఎం కేసీఆర్ ఉన్నత అవకాశం కల్పిస్తారని స్పష్టం చేశారు.