కోటగిరి, సెప్టెంబర్ 23: ప్రభుత్వ కళాశాలలకు ఆదరణ పెరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలతోపాటు మెరుగైన బోధన అందిస్తుండడంతో కళాశాలల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. జిల్లా కేంద్రంలోని బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అత్యధికంగా విద్యార్థులు చేరారు. ప్రస్తుతం ఇక్కడ ఇంటర్ రెండో సంవత్సరంలో 526 మంది విద్యార్థులు ఉన్నారు. కొత్తగా ఫస్టియర్ విద్యార్థులు 350 మంది చేరారు. అడ్మిషన్లు కొనసాగుతున్నందున సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో మెరుగైన విద్యాబోధన, ఉత్తమ ఫలితాలు, ఉచిత పాఠ్యపుస్తకాలు ఇవ్వడంతో విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ఆదరణ పెరుగుతోంది. గతంతో పోలిస్తే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నెల 30వ తేదీ వరకు అడ్మిషన్లు తీసుకోనున్నారు. జిల్లాలో మొత్తం 15 ఇంటర్ కళాశాలలు ఉన్నాయి. కొన్ని కాలేజీల్లో గతంలో ఎన్నడూ లేనంతగా విద్యార్థుల సంఖ్య పెరిగిందని అధ్యాపకులు అంటున్నారు. ప్రైవేటు కన్నా మెరుగైన ఫలితాలు వస్తుండడంతో ప్రభుత్వ కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. సరిపడా తరగతి గదులు, అధ్యాపకులు ఉండడంతో ప్రభుత్వ కాలేజీలపై మొగ్గు చూపుతున్నారు.
పెరుగుతున్న నమోదు..
2019-20 విద్యా సంవత్సరంలో ఇంటర్ మొదటి సంవత్సరంలో 3,840 మంది విద్యార్థులు చేరారు. 2020-21లో 3,800, ప్రస్తుత విద్యా సంవత్సరానికి 4,400 మంది అడ్మిషన్లు తీసుకున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్ మొదటి, ద్వితీయ కలిపి 8,276 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో 3,876 మంది ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. గత విద్యా సంవత్సరం కొవిడ్ కారణంగా తరగతులు, పరీక్షలు నిర్వహించకపోవడంతో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో సాధారణ ఫలితాలే వచ్చాయి. అంతకుముందు ఏడాది గణాంకాలను పరిశీలిస్తే ప్రైవేటు కళాశాలల కన్నా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనే ఉత్తమ ఫలితాలు వచ్చాయి. ప్రభుత్వ కళాశాలలో ఉచితంగా పాఠ్యపుస్తకాలు, ఎలాంటి ఫీజులు లేకపోవడం, నిపుణులైన అధ్యాపకులతో బోధించడం, ఉదయం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించడం తదితర కారణాలతో మూడేండ్లుగా ప్రభుత్వ కళాశాలల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 2019లో ప్రైవేటు కళాశాలల్లో 65 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో 69 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ గ్రూపులతో కలిపి ప్రభుత్వ కాలేజీల్లో 71 శాతం, ప్రైవేటులో 67 శాతం ఉత్తీర్ణత సాధించడం గమనార్హం.
కళాశాలలు.. ప్రవేశాలు
నిజామాబాద్ బాలుర కళాశాలలో 527, బాలికల కళాశాలలో 515, డిచ్పల్లిలో 226, మాక్లూర్లో 211, మోర్తాడ్లో 258, బోధన్ మధుమలంచలో 159, వర్నిలో 123, బోధన్ జీజేసీలో 478, ఆర్మూర్ బాలికల కళాశాలలో 343, బాలుర కళాశాలలో 232, భీమ్గల్లో 499, అయిలాపూర్లో 222, బాల్కొండలో 270, ధర్పల్లిలో170, కోటగిరిలో 227 మంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకున్నారు.
అధ్యాపకుల నిరంతర కృషి..
ప్రభుత్వ ఇంటర్ కళాశాలల్లో నిపుణులైన అధ్యాపకులు బోధిస్తున్నారు. ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. ప్రైవేట్ కళాశాలల కన్నా బాగా బోధించడంతో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూడు, నాలుగేండ్లుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. జూనియర్ ఇంటర్లో చేరేందుకు ఈ నెల 30వ తేదీ వరకు గడువు ఉంది.
ఎల్.రఘురాజ్, డీఐఈవో నిజామాబాద్