మూడ్రోజుల నుంచి నాన్స్టాప్గా కురుస్తున్న వాన ఆగిపోవడంతో ఉమ్మడి జిల్లా ఊపిరి పీల్చుకుంది. మంగళవారం సూర్యుడు ప్రకాశించడంతో గులాబ్ గండం గట్టెక్కినట్టేనని ఊరట పొందింది. తుఫాన్ ప్రభావం సాధారణ ప్రజానీకంతోపాటు ముఖ్యంగా రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. వర్షం తెరిపినివ్వడంతో పత్తి, కంది వంటి మెట్టపంటలపై ఆశలు సజీవంగా ఉన్నాయి. కాగా హైదరాబాద్లో భారీ వర్షంతో జిల్లా పరిధిలో మూసీ ఉధృతంగా ప్రవహిస్తున్నది. దాంతో పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరదలతో అక్కడక్కడా రోడ్లు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చెరువులు, కుంటలు అలుగులు పోస్తున్నాయి. మెట్టపంటల రక్షణలో రైతులకు అండగా వ్యవసాయ శాఖ రంగంలోకి దిగింది. జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా, ప్రమాదాలకు తావివ్వకుండా ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలతో పరిస్థితిని సమీక్షించారు.
నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్28(నమస్తే తెలంగాణ) : వర్షాల ప్రభావంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వాగులు ఉప్పొంగుతున్నాయి. మెజార్టీ ప్రాంతాల్లో చెరువులు, కుంటలు అలుగు పోస్తున్నాయి. వరద కారణంగా పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్లో కురిసిన భారీ వర్షాలతో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో పోచంపల్లి, బీబీనగర్, వలిగొండ మండలాల్లోని పలుచోట్ల కల్వర్టులు, బ్రిడ్జీల మీదుగా ప్రవహిస్తున్నది. దాంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నల్లగొండ జిల్లాలోని మర్రిగూడెం, చండూరు, మునుగోడు మండలాల్లోనూ వాగులు ఉప్పొంగుతున్నాయి. నిడమనూరు మండలం ఊట్కూర్-ఎర్రబెల్లి, మాడ్గులపల్లి మండలం ఆగామోత్కూర్-భీమనపల్లి మధ్య కల్వర్టులు ధ్వంసమయ్యాయి. జిల్లాలో 12 ఇండ్లు పూర్తిగా, 82 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. పిడుగుపాటుతో మూడు పశువులు మృత్యువాత పడ్డాయి. సూర్యాపేట జిల్లాలోని మఠంపల్లి, మేళ్లచెర్వు, చింతలపాలెం, నేరడుచర్ల మండలాల్లోనూ చెరువులు మత్తడి దుంకుతున్నాయి. చింతలపాలెం మండలంలోని బుగ్గవాగులో మంగళవారం ఉదయం ఓ లారీ వరద ఉధృతికి బోల్తా పడింది. డ్రైవర్, క్లీనర్ అప్రమత్తమై ప్రాణాలు కాపాడుకున్నారు.
తెరిపినివ్వడంతో ఊరట..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. మంగళవారం వర్షం లేకపోవడంతో ప్రజలు తమ రోజువారీ పనులపై దృష్టి సారించారు. అయితే వరుస వర్షాలతో మెట్ట పంటలకు ముప్పు నెలకొంది. పత్తి పంటకు ఇప్పటికే కొంత నష్టం కలిగింది. పూత, పిందె రాలిపోయే ప్రమాదం ఉండడంతో వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు. నష్ట నివారణకు సంబంధించి రైతులకు సూచనలు చేస్తున్నారు.
అధికారులు అలర్ట్గా ఉండాలి
మంత్రి జగదీశ్రెడ్డి
వర్షాల నేపథ్యంలో అన్నిస్థాయిల్లోని అధికారులు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆదేశించారు. మంగళవారం ఉదయం నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల కలెక్టర్లతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులపై సమీక్షించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ శాఖను అలర్డ్ చేయాలని కలెక్టర్లకు సూచించారు. వైద్యారోగ్యశాఖతోపాటు రెస్క్యూ బృందాలను అందుబాటులో ఉంచాలన్నారు.
అలుగు పోస్తున్న 2287 చెరువులు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మెజార్టీ చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. ఏ ఒక్క చెరువు కూడా నీరు లేకుండా ఉండకపోవడం గమనార్హం.
2 క్రస్ట్ గేట్ల ద్వారా సాగర్నీటి విడుదల
నందికొండ, సెప్టెంబర్ 28 : నాగార్జునసాగర్ రిజర్వాయర్కు 58,066 కూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. 2క్రస్ట్ గేట్ల ద్వారా 16,116 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ పూర్తి నీటి సామర్థ్యం 590 (312.50 టీఎంసీలు) అడుగులు కాగా మంగళవారం సాయంత్రానికి 589.60 అడుగుల వద్ద నీరు నిల్వ ఉన్నది. కుడికాల్వకు 8,067 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 32,683 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 1,200 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
మూసీకి 13,693 క్యూసెక్కుల ఇన్ఫ్లో
కేతేపల్లి, సెప్టెంబరు 28 : మూసీ ప్రాజెక్టుకు మంగళవారం 13,693 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. 6 క్రస్టు గేట్లను ఎత్తి 7,040 క్యూసెక్కులను విడుదల చేశారు. కుడి, ఎడమ కాల్వలకు 180.72 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు(4.46 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 640.40 అడుగులు (3.31 టీఎంసీలు) ఉన్నట్లు అధికారులు తెలిపారు.