సికింద్రాబాద్ : ‘భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు మతిభ్రమించిందని, రాష్ట్ర సర్కారుపై అవినీతి ఆరోపణలు చేస్తున్న ఆ పార్టీ అగ్రనేతలు కూడా ఆత్మ విమర్శ చేసుకోవాలని రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేష్ అన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారని, అవినీతి ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని, వెకిలి చేష్టలు మానకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని గజ్జెల నాగేష్ ఘాటుగా స్పందించారు. ప్రధాని మోడీ మేకిన్ ఇండియా పాలసీని పక్కన పెట్టి సేల్ ఇండియా విధానాన్ని అమలు చేస్తున్నారన్నారు.
ఈ క్రమంలో గురువారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్న బీజేపీ అగ్రనేతలు ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్ఎస్ సర్కారు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు.
రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందినిట్లు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల కోటి ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా చేసిన ఆరోపణలు ఆయన స్థాయిని దిగజార్చే విధంగా ఉన్నాయి.
బీజేపీ నేతలు నోరు పారేసుకుంటున్న తీరును ప్రజలు ఇప్పటికే అసహ్యించుకుంటున్నారు. టీఆర్ఎస్పై ఆవాకులు చవాకులు పేలితే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్న బీజేపీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.
317 జీవోపై పోరాటం చేస్తామంటూ తెలంగాణ ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారని ఆరోపించారు. రాజకీయాలు మానుకొని అభివృద్ధికి సహకరించాలని సూచించారు.