పార్కింగ్ చేసిన వాహనాలే టార్గెట్
సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని పట్టుకున్న పోలీసులు
రూ.5.50 లక్షల విలువ చేసే 85 బ్యాటరీలు స్వాధీనం
హన్మకొండ సిటీ, ఏప్రిల్ 6 : రాత్రి పూట పార్కింగ్ చేసిన వాహనాల బ్యాటరీలను దొంగతనం చేస్తున్న వ్యక్తిని సీసీఎస్, మట్టెవాడ పోలీసులు సంయుక్తంగా మంగళవారం అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి రూ.5.50లక్షల విలువ చేసే 85 బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్స్ అండ్ క్రైమ్ అదన పు డీసీపీ, సెంట్రల్ జోన్ ఇన్చార్జి డీసీపీ కే పుష్ప కథనం ప్రకారం.. ఎనుమాముల మార్కెట్ బాలాజీ నగర్కు చెందిన పస్తుల ఐలయ్య(30) చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో చిల్లరగా తిరుగుతూ తాగుడుకు బానిసయ్యాడు. హన్మకొండ వాజ్పేయ్ కాలనీకి చెందిన తిరుపతమ్మను మొదట వివాహం చేసుకోగా ఏడాదిలోపే విడాకులయ్యాయి. తర్వాత హన్మకొండకు చెందిన సునీతను రెండో పెళ్లి చేసుకున్నాడు. జల్సాల కోసం 2013 నుంచి చిల్లర దొంగతనాలు చేయడం ప్రారంభించాడు.
సుబేదారి పీఎస్ పరిధిలో మూడు దొంగతనాలతోపాటు 2014లో ఇంతెజార్గంజ్ పరిధిలో ఒక బైక్, 2019లో మట్టెవాడ పరిధిలో ఐదు సెల్ఫోన్లు చోరీ చేసి, జైలుకు వెళ్లి వచ్చాడు. అనంతరం హన్మకొండలోని రెడ్డికాలనీలో నివాసం ఉంటూ అంబాలకు చెందిన రవి ఆటోను కిరాయికి తీసుకుని, అందరితో ఆటో నడుపుతున్నట్లు నటిస్తూ మళ్లీ దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. రాత్రి పూట పార్కింగ్ చేసిన లారీలు, ట్రాక్టర్లు, డీసీఎంలు, టాటా ఏస్ వాహనాల్లోని బ్యాటరీలను చోరీ చేస్తున్నాడు. ఇప్పటికీ మొత్తం 85 బ్యాటరీలను చోరీ చేశాడు. వీటిపై మట్టెవాడ, ఇంతెజార్గంజ్, గీసుగొండ, సుబేదారి, హన్మకొండ పీఎస్ పరిధిలో 7 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు సీపీ ఆదేశాలతో డీసీపీ పర్యవేక్షణలో సీసీఎస్, మట్టెవాడ సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడి కదలికలపై నిఘా పెట్టారు. మంగళవారం ఉదయం ఆటోనగర్లో ఐలయ్యను పట్టుకుని, అతడి నుంచి బ్యాటరీలతో పాటు నాలుగు సెల్ఫోన్లు, నాలుగు ఆటోటైర్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు.
ప్రతిభ చూపిన సిబ్బందికి గౌరవం
నిందితుడిని కష్టపడి పట్టుకుని, చోరీ సొమ్ము రికవరీ చేసిన పోలీస్ సిబ్బందిని అధికారులు గౌరవించారు. అధికారులంతా నిలబడి, సిబ్బందిని కుర్చీల్లో కూర్చొబెట్టి, నిందితుడి అరెస్టు చూపించారు. రానున్న రోజుల్లో విధుల్లో మరింత రాణించేలా వారిలో ఉత్సాహాన్ని నింపారు. సీసీఎస్ ఏఎస్సై శ్రీనివాస్రాజు, హెడ్ కానిస్టేబుల్ కే రవికుమార్, కానిస్టేబుల్ మహమ్మద్ అలీ, సీహెచ్ వేణుగోపాల్, ఎండీ నజీరుద్దీన్ ఈ గౌరవాన్ని అందుకున్నారు. కార్యక్రమంలో క్రైం ఏసీపీ బాబూరావు, వరంగల్ ఏసీపీ బాబూరావు, సీఐలు రమేశ్కుమార్, శ్రీనివాస్రావు, గణేశ్, ఎస్సై సంపత్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
పార్కులో చిరుతదాడి.. వ్యక్తికి తీవ్ర గాయాలు.. వీడియో
ధోనీ హెలికాప్టర్ షాట్ చాక్లెట్లు వచ్చేశాయ్!