ఖమ్మం, జనవరి 17: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం పరిశ్రమిస్తున్నారు. దీనిలో భాగంగానే సోమవారం జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో ప్రభుత్వ విద్యావ్యవస్థల బలోపేతంతోపాటు రాష్ట్రంలోని ప్రైవేటు విద్యాసంస్థలో ఫీజుల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దీనిలో భాగంగా ప్రైవేట్ సూళ్లు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యాబోధన వంటి అంశాలపై కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ రెండు అంశాలపై పూర్తి అధ్యయనం చేసి విధివిధానాలను రూపొందించేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షురాలిగా ఉండే ఈ సబ్ కమిటీలో రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్కుమార్, తలసాని శ్రీనివాసయాదవ్, నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, జగదీశ్రెడ్డి, హరీశ్రావు, ప్రశాంత్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, కేటీఆర్ సభ్యులుగా ఉంటారు. రానున్న శాసన సభా సమావేశాల్లో దీనికి నూతన చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. నాణ్యమైన బోధన, మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం సుమారు రూ.7289 కోట్ల నిధులను కేటాయిస్తుంది. ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమాల ప్రణాళిక కోసం కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర విద్యాశాఖ కేబినెట్ సబ్ కమిటీలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్కు స్థానం కల్పించడం పట్ల పలువురు విద్యావేత్తలు, జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.