పాపన్నపేట, అక్టోబర్ 14 : ఏడుపాయల వనదుర్గాభవానీ మాతను గురువారం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఏడుపాయలకు చేరుకున్న ఆమెకు ఆలయ ఈవో సార శ్రీనివాస్తోపాటు వేదపండితులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజగోపురంలో అమ్మవారిని ఆమె దర్శించుకున్నారు. అనంతరం శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న గోకుల్షెడ్కు వెళ్లి అక్కడ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
టేక్మాల్లో..
టేక్మాల్, అక్టోబర్ 14 : దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా గ్రామాల్లో ప్రతిష్ఠించిన దుర్గాదేవి అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. గురువారం మండల పరిధిలోని టేక్మాల్, అచ్చన్నపల్లి గ్రామాల్లోని దుర్గామాతను అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ దర్శించుకొని ప్రత్యే క పూజలు చేశారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్టు ఆయన తెలిపారు. అనంతరం అన్నదానం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆయన వెంట నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.
సామూహిక కుంకుమార్చన
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం టేక్మాల్లో నెలకొల్పిన దుర్గామాతకు మహిళలు సామూహిక కుంకుమార్చనలు చేశారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా జాగృతి అధ్యక్షురాలు మల్లిక, మాజీ సర్పంచ్ వరలక్ష్మి, మహిళలు, ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఉన్నారు.
మెదక్ మున్సిపాలిటీలో..
మెదక్ మున్సిపాలిటీ, అక్టోబర్ 14 : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని మండపాల్లో దుర్గామాత వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. చివరి రోజు కావడంతో భక్తులు దుర్గామాతను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
నిజాంపేటలో..
నిజాంపేట, అక్టోబర్ 14 : మండలవ్యాప్తంగా దుర్గామాత అమ్మవారి శరన్నవరాత్రోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. గురువారం మండలంలోని తిప్పనగుల్లలో ఉత్సవ కమిటీ సభ్యులు ప్రతిష్ఠించిన దుర్గామాతను ఎంపీపీ సిద్ధిరాములు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి దంపతుల పేరిట ఎంపీపీ ప్రత్యేక పూజలు చేయించారు. కార్యక్రమంలో సర్పంచ్ చంద్రవర్ధిని, టీఆర్ఎస్ నాయకులు యాదగరి, ఎల్లం, దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు.
చిన్నశంకరంపేటలో..
చిన్నశంకరంపేట, అక్టోబర్ 14 : చిన్నశంకరంపేటతోపాటు మండలంలోని వివిధ గ్రామాల్లో గురువారం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. చిన్నశంకరంపేటలో అమ్మవారి మండపం వద్ద హోమం నిర్వహించారు. చిన్నశంకరంపేట, మడూర్, అంబాజిపేట గ్రామాల్లో అమ్మవారి మండపాల వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
చేగుంట/మనోహరాబాద్లో..
చేగుంట/మనోహరాబాద్, అక్టోబర్ 14 : మండల కేంద్రమైన తూప్రాన్తోపాటు వెంకటాపూర్లోని లలితాపరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో సహస్త్ర చండీయోగ దీక్షపరులు గురుజీ సోమయాజుల రవీందర్శర్మ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని భక్తులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. మండల కేంద్రమైన చేగుంట, నార్సింగితోపాటు వివిధ గ్రామాల్లో దుర్గామాత అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఇబ్రహీంపూర్లో కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో దుర్గామాతకు గోల్కొండ కిషన్రావు దేశ్ముఖ్ ప్రత్యేక పూజలు చేసి అన్నదానం నిర్వహించారు.
పెద్దశంకరంపేట/రామాయంపేటలో..
పెద్దశంకరంపేట/రామాయంపేట, అక్టోబర్ 14 : పట్టణంలోని భవానీమాత ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిషాసురవర్ధిని రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. రామాయంపేట మండలంలోని సుతారిపల్లి, నందిగామ తదితర గ్రామా ల్లో అమ్మవారికి భక్తులకు ప్రత్యేక పూజలు చేశారు.