పూర్వ అదనపు సంచాలకులు లక్ష్మారెడ్డి
మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 11: ప్రత్యేక అవసరాలు గల పిల్లల సామర్థ్యాలను పెంచేందుకు కృషి చేయాలని పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర పూర్వ సంచాలకులు లక్ష్మారెడ్డి సూచించారు. ‘విభిన్న అవసరాల విద్యార్థులకు బోధన-ప్రత్యేక వ్యూహాలు’ అనే అంశంపై మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు శనివారం నిర్వహించిన ఆన్లైన్ శిక్షణలో ముఖ్య అతిథిగా పాల్గొని పలు సూచనలు చేశారు. ఏ పాఠశాలలోనూ ప్రత్యేక అవసరాలుండే పిల్లలకు ప్రవేశాలు నిరాకరించకూడదని ఆయన పేర్కొన్నారు. మిగతా పిల్లలతో పాటే దివ్యాంగ విద్యార్థులకు సైతం బోధించాలన్నారు. సమ వయస్సు అభ్యసనంలోనే పిల్లలు మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. జిల్లాలోని ఉపాధ్యాయులందరూ ప్రత్యేక బోధన వ్యూహాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అనంతరం మార్గిక స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు డాక్టర్ నీనారావు మాట్లాడుతూ ఇతర విద్యార్థులతో సమాన అవకాశాలు దివ్యాంగ విద్యార్థులకు ఇస్తే చాలదని, ఇతర విద్యార్థులతో సమానంగా పురోగమించేలా చూడాలన్నారు. విలీన విద్య జిల్లా సమన్వయకర్త డాక్టర్ సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ విలీన విద్యపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమంగా ఈ శిక్షణ నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లాలోని మండల విద్యాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, కేజీవీబీ ప్రత్యేక అధికారులు, ఎంపిక చేసిన ఉపాధ్యాయులు, విలీన విద్య రిసోర్స్ పర్సన్లు తదితరులు పాల్గొన్నారు.