వైరా టౌన్, సెప్టెంబర్ 30: సంప్రదాయ వరి పంట ద్వారా వచ్చే సాధారణ బియ్యానికి భిన్నమైన పంట అన్నదాతలకు సిరులు కురిపిస్తోంది. బ్లాక్రైస్గా పేరుగాంచిన ఈ చక్రవర్తుల బియ్యం కర్షకులకు సిరులు కురిపిస్తోంది. వరి బియ్యంతో వండిన అన్నాన్ని ఎక్కువగా తిన్నా అనారోగ్యమే అంటున్న వైద్యులు అందుకు ప్రత్యామ్నాయంగా బ్లాక్ రైస్ను సూచిస్తున్నారు. ఈ బ్లాక్రైస్తో వండిన అన్నం తింటే ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు.
అసలు ఈ బ్లాక్ రైస్ అంటే ఏమిటి? దీని వ్యవసాయ పద్ధతులు ఎలా ఉంటాయి? అనే విషయాలపై ఓ కథనం. కడుపునిండా అన్నం తిందామంటే ఎక్కడ షుగర్ వస్తుందో అనే ఆందోళన. చపాతి తిందామంటే అంతగా ఆకలి తీరదాయె. ఈ నేపథ్యంలో వాటిని ప్రత్యామ్నాయంగా వచ్చినవే బ్లాక్ రైస్. అంటే భోజనం ప్లేట్లో తెల్లటి మెతుకులకు బదులు నల్లటి మెతుకులు ఉంటాయన్నమాట. పోషక విలువలు అధికంగా ఉంటాయంటున్న ఈ బ్లాక్ రైస్ను మండలంలోని వల్లాపురం గ్రామంలో ఓ ఔత్సాహిక రైతు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నాడు.
అతడే తుమ్మల రాణాప్రతాప్. బ్లాక్ రైస్ను పూర్వకాలంలో చక్రవర్తులు, వారి కుటుంబ సభ్యులు మాత్రమే తినేందుకు ఉపయోగించేవారన్నది పూర్వీకుల మాట. అందుకే వీటిని చక్రవర్తుల బియ్యం అని పేరు కూడా వచ్చిందని చెబుతున్నారు. సాధారణ వరి కంటే బ్లాక్ రైస్ రకానికి చెందిన వరి ఎకరానికి 10 నుంచి 15 బస్తాలు మాత్రమే దిగుబడి వస్తుంది. నల్ల బియ్యంలో కాలాబట్టి, మణిపూర్ బ్లాక్, సుగంధ భరితం, రత్నచోడి, సవలా నారాయణ కమిటీ వంటి రకాలు ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీపీటీ 5204 రకం వరినే రైతులు ఎక్కువగా సాగు చేస్తుంటారు. బీపీటీ సాంబలో బ్లెసిమిక్ మండెక్స్ జీఐ వాల్యూ 51.42 నుంచి 50.5 శాతం రకాన్ని బట్టి ఉంటుంది. ఈ బ్లెసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్న బియ్యం తరుచూ తీసుకోవడం వల్ల ఒంట్లో చక్కెర నిల్వలు పెరిగి మధుమేహానికి దారితీస్తుంది. దీనికి తోడు పని ఒత్తిడి పెరుగడం, వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల అనేక అనారోగ్య సమస్యలూ పెరుగుతాయి.
నల్లబియ్యంలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. సూక్ష్మ పోషకాలు చాలా అధికం. చక్కెర నిష్పత్తి తక్కువ. గ్లెసిమిక్ ఇండెక్స్ను 41 శాతం మాత్రమే. పీచు పదార్థాలూ ఎక్కువే. విటమిన్-ఈ పుష్కలం. మధుమేహాన్ని తగ్గించడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. టైప్2 షుగర్ ఉన్నవారికి రక్తంలో ఉన్న చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. క్యాన్సర్తో పోరాడుతుంది. రక్తనాళాలను శుభ్రపరిచి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఒంట్లో కొవ్వు పెరుగకుండా నియంత్రిస్తుంది. శరీరంలో పెరిగే అల్టీమర్స్ను అడ్డుకుంటుంది. కాలేయ వ్యాధులు, లివర్ ఫ్యాట్ను తగ్గిస్తుంది.. కంటి ఆరోగ్యానికీ దోహదపడుతుంది. బ్లాక్రైస్లో ఉండే లాటిన్ జియాక్సివిన్ హానికారమైన బ్లూ లైట్ తరంగాలను కంటి లోపలే అడ్డుకొని రెటినాను ఆరోగ్యంగా ఉంచుతుంది. శుక్లాలను అరికడుతుంది.
వల్లాపురం రైతు తుమ్మల రాణాప్రతాప్ తన గ్రామంలో ఒక ఎకరం విస్తీర్ణంలో ఎస్56, ఎస్58 రక్తశాలి కృష్ణబ్రీహి రకాలను సాగు చేస్తున్నాడు. నిరుడు ఎకరం పొలంలో ఈ నాలుగు రకాల వంగడాలను సాగు చేసి 15 క్వింటాళ్ల దిగుబడిని సాధించాడు. కిలో రూ.300 చొప్పున బ్లాక్ రైస్ విత్తనాలను కొనుగోలు చేసి వెదజల్లే పద్ధతిలో సాగు చేశాడు. బీపీటీ 5204 మాదిరిగా ఉండే సన్నబియ్యం రకం 120 రోజుల్లో పంట కోతకు వస్తుంది. డెల్టా రైతులకు నూతన రకాలను పరిచయం చేస్తున్నాడు. బ్లాక్ రైస్ కిలో రూ.100 చొప్పున విక్రయిస్తున్నాడు. కేవలం వరి పంటే కాకుండా అధిక సాంద్రత విధానంలో పత్తి పంటను కూడా సాగు చేస్తున్నాడు.