తెలంగాణ కళాకారుల ప్రతిభ అబ్బుర పరిచింది. ఉద్యమంలో కేసీఆర్ మాట ఎంత పవర్ఫుల్గా పేలిందో తెలంగాణ కళాకారుల పాట కూడా అంతే పవర్ పుల్గా పేలిందని చెప్పొచ్చు. తెలంగాణలో అజ్ఞాత సూర్యులు కొన్ని వందలు, వేల మంది ఉన్నారని ఈ కళోత్సవాలను చూసిన తర్వాతే తెలిసింది. ఒకప్పుడు సినిమాలో తెలంగాణ అని చెప్పుకోవాలన్నా, తెలంగాణ యాసలో మాట్లాడాలన్నా ఆలోచించాల్సి వచ్చేది. ఈరోజు తెలంగాణ భాషలో మాట్లాడితేనే సినిమాలు హిట్టవుతున్నాయి. ఈ మధ్యన తెలుగు సినిమాలు పాన్ ఇండియాలో దుమ్ములేపుతున్నాయి. మన తెలుగు పార్టీ కూడా దుమ్ము లేపుతుంది. ఆ రోజు త్వరలోనే వస్తుంది. మీ అందరి మద్దతు, ఆశీర్వాదం అవసరం.
కరీంనగర్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ) ‘తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ మాట..మన కళాకారుల పాట పవర్ పుల్గా పేలాయి..’అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. ఆదివారం రాత్రి స్థానిక అంబేద్కర్ స్టేడియంలో జరిగిన కరీంనగర్ కళోత్సవాల ముగింపు సభకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. కళోత్సవాలు అంటే ఏ కళాభారతిలోనో వెయ్యి మంది మధ్యన చిన్నగా చేస్తున్నాడని అనుకున్నానని, కానీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డితోపాటు ప్రముఖులు వచ్చిన విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకుని ఇక్కడికి వచ్చానని చెప్పారు. తన సహచర మంత్రి గంగుల కమలాకర్ ఒక ప్రత్యేక హెలీకాప్టర్ ఏర్పాటు చేశారన్నారు. ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని, మిట్టపల్లి సురేందర్, వందేమాతరం శ్రీనివాస్, మైవిలేజ్ షోలో గంగవ్వలాంటి ఎందరో కళాకారుల ప్రతిభను ఇక్కడ చూడగలిగానని అన్నారు. గంగవ్వ తనను మహేశ్బాబు అన్నారని, ఈ మాట వింటే మహేశ్బాబు ఫీలవుతాడేమోనని చమత్కరించారు. గంగమ్మకు మాట ఇస్తున్నానని మై విలేజ్షోకు తప్పకుండా వస్తానని, ఆ షోలో తనకు తెలియని విషయాలు తెలుసుకుని, తనకు తెలిసిన విషయాలు చెబుతానని అన్నారు.
వందేమాతరం శ్రీనివాస్ ఎర్రజెండా పాట పాడారని, అయితే ఇపు డు తెలంగాణలో ఎరువు, తెలుపు కలిసి గులాబీ జెండా అయిందన్నారు. ఎరుపు జెండాతో మీరు కోరుకున్న పనులన్నీ ఇప్పుడు కేసీఆర్ చేస్తున్నారని అన్నారు. గతంలో ఎర్ర జెండా ఎత్తుకున్న ప్రతి సోదరుడు, సోదరి ఈ రోజు కేసీఆర్ బాటలో నడుస్తున్నారని చెప్పారు. వేదికపై ఉన్న కళాకారుల గురించి ప్రస్తావించిన ఆయన మధుప్రియ అప్పుడెప్పుడో సుల్తానాబాద్లో కలిసిందని, మళ్లీ ఇప్పుడు కలుసుకున్నామన్నారు. తెలంగాణలో అజ్ఞాత సూర్యులు కొన్ని వందలు, వేల మంది ఉన్నారో కరీంనగర్లో నిర్వహించిన కళోత్సవాల ద్వారా తెలిసిందన్నారు. కరీంనగర్కు చెందిన కొరియోగ్రాఫర్ శేఖర్ వైరస్లో ఎంతో అద్భుతమైన టా లెంట్ ఉందని, ఇలాంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా ఎంద రో ఉన్నారని చెప్పారు.
వందేమాతరం శ్రీనివాస్ చెప్పినట్లు ఒకప్పుడు సినిమాలో తెలంగాణ అని చెప్పుకోవాలంటే, మన యాసలో మాట్లాడాలంటే ఆలోచించాల్సి వచ్చేదని, రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగా ణ భాషలో మాట్లాడితేనే సినిమాలు హిట్టవు తున్నాయన్నారు. మిమిక్రీ ఆర్టిస్టు శి వారెడ్డి సహా ఎందరో కళాకారులు పాపులరయ్యారని స్పష్టం చేశారు. ఇలాంటి కళాకారులకు ఒక్క గంగుల కమలాకర్ మాత్రమే ప్రోత్సహించడంకాదని, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సారథ్యంలో రాష్ట్ర సంస్కృతిక సారథిని ఏర్పాటు చేసి ఆనాడు ఉద్యమంలో పాల్గొన్న 574 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి, పే స్కేల్ ఇచ్చి తెలంగాణ ప్రభుత్వం గౌరవించిందని అన్నారు. ఇక్కడి కళోత్సవాల స్ఫూర్తితో మిగతా అన్ని జిల్లాలతోపాటు హైదరాబాద్లో కూడా తెలంగాణ వైభవాన్ని, కళాకారుల గొప్పదనాన్ని చాటే విధంగా ప్రతి ఏటా బ్రహ్మాండంగా జరుపుకుందామన్నారు.
తాను కరీంనగర్ మిషన్ హాస్పిటల్లో పుట్టానని, సెయింట్ జోసఫ్ స్కూల్లో నాలుగైదేళ్లు చదువుకున్నానని కేటీఆర్ అన్నారు. ఈ నగరంతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉన్నదన్నారు. కరీంనగర్ అంటే నాకంటే కేసీఆర్కు ప్రత్యేకమైన ప్రేమ ఉందని, ఆనాడు ఇక్కడి నుంచే పార్లమెంట్లో అడుగుపెట్టి తెలంగాణ వాదాన్ని, వాణిని గట్టిగా వినిపించారని, ఆ తర్వాత ఆమరణ దీక్షకు కూడా ఇక్కడి నుంచే పూనుకున్నారని, దీంతోనే తెలంగా ణ కల సాకారమైందన్నారు. కరీంనగర్ కళాకారు ల ప్రతిభ తనను ఎంతో అబ్బుర పర్చిందని, మన తెలంగాణలో ఇందరు కళాకారులు ఉన్నారనే విషయం తెలిసి వచ్చిందని పేర్కొన్నారు. రోజా రమణి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రోత్సహించినందుకు ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ఇంత పెద్ద కార్యక్ర మాన్ని నిర్వహించడం వెనక మంత్రి కమలాకర్ వెనుక అనేక మంది ఉంటారని, వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్పారు.
తెలుగు సినిమాలు ఈ మధ్యన పాన్ ఇండియా లో దుమ్ములేపుతున్నాయని, మన తెలుగు పార్టీ కూడా దుమ్ము లేపుతుందని, ఆ రోజు కూడా త్వ రలోనే వస్తున్నదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశా రు. మీ అందరి ఆశీర్వాదం అవసరమన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భవించిన తర్వాత సింహగర్జన పేరుతో మొదటి సభ ఇక్కడే జరిగిందని, తెలంగాణ వచ్చిందని, ఇదే కరీంనగర్ గడ్డపై కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మీ అందరి ఆశీర్వాదంతో ఇండియా మొత్తం దుమ్మురేగాలని ఆకాంక్షిస్తు న్నట్ల్లు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ జా తీయ పార్టీ ఆవిర్భావ సభను కరీంన గర్లోనే నిర్వహించాలని కేటీఆర్ను కోరారు. ఓవైపు ఐటీ టవర్ నిర్మించుకున్నామని, మరోవైపు మెడికల్ క ళాశాల నిర్మించుకోబోతున్నామని, అంగరంగ వై భవంగా ఇంకో వైపు వేంకటేశ్వరస్వామి ఆలయా న్ని కూడా నిర్మించుకుంటామని, కేసీఆర్, కేటీఆర్ ప్రోత్సాహమేకారణమని చెప్పారు. 2001లో టీఆర్ఎస్ స్థాపించి కరీంనగర్లో మొదటి సారి సింహగర్జన సభను ఏ విధంగానైతే నిర్వహించారో అదే విధంగా జాతీయ పార్టీ ఆవిర్భావ సభ కూడా ఇక్కడే నిర్వహించాలని కరీంనగర్ ప్రజల పక్షాన తరుఫున విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ వందేమాతరం శ్రీనివాస్, శివారెడ్డి, రోజా రమణి సహా పలువురు కళాకారులను ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యేలు రసమయి, సుంకె ర విశంకర్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ఎ మ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, మేయర్ సునీల్రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, కోడూరి సత్యనారాయణ ఉన్నారు.