భూపాలపల్లి, మే 13 : పిల్లలను ఆటల వైపు మళ్లించి, వారిలో క్రమశిక్షణ, మానసికోల్లాసం, దేహదారుఢ్యం పెంపొదించడంతో పాటు విద్యార్థి దశలోనే ఆటల్లో శిక్షణనిచ్చి, మెళకువలు నేర్పించడానికి సింగరేణి యాజమాన్యం చర్యలు తీసుకున్నది. 11 ఏరియాల్లో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను 25 రోజుల పాటు నిర్వహిస్తున్నది. వీటి ద్వారా సింగరేణి ఉద్యోగుల పిల్లలు ఆటల్లో మెళకువలు నేర్చుకోవడంతో పాటు ఆరోగ్యం కూడా పొందుతున్నారు.
సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో వర్క్ పీపుల్స్ అండ్ గేమ్స్ ఆధ్వర్యంలో వేసవి ఉచిత క్రీడా శిక్షణ శిబిరాలను ఈ నెల 6వ తేదీన ప్రారంభించారు. ఈ నెల 30వ తేదీ వరకు 25 రోజుల పాటు 18 ఏండ్లలోపు సింగరేణి ఉద్యోగుల పిల్లలు, ఇతరులకు కూడా వివిధ క్రీడాంశాల్లో శిక్షణను ఇస్తున్నది. పిల్లల ఆసక్తిని బట్టి ముందు నిర్ణయించిన విధంగా శిబిరంలో వివిధ క్రీడల్లో చిన్నారులకు శిక్షణ ఇస్తున్నారు. శిబిరాల నిర్వహణకు గాను సింగరేణి యాజమాన్యం మొత్తం రూ.9, 37,485 కేటాయించి ఖర్చు చేస్తున్నది. ఇందులో రూ.1,00,954తో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు అవసరమైన క్రీడా సామగ్రిని కొనుగోలు చేసింది. అన్ని క్రీడలకు సంబంధించి మొత్తం 51మంది అనుభవజ్ఞులైన కోచ్లను నియమించింది. వీరి గౌరవ వేతనానికి గానూ రూ.1,68,300 కేటాయించింది. శిక్షణ పొందుతున్న వారికి టీషర్ట్స్ ఇవ్వడం, ఇవి ఇవ్వని ఏరియాల్లో రోజూ ఏదో ఒకరకం పండ్లు ఇవ్వడంలాంటివి చేస్తున్నారు. ఇందుకుగాను రూ. 6,15,000 ఖర్చు చేస్తున్నది. ఆయా ఏరియాల్లో వేసవి క్రీడా శిబిరాల ప్రారం భం, ముగింపునకు ప్రతి ఏరియాకు రూ.4,840 చొప్పున, మొత్తం రూ.53,240 కేటాయించింది. ఇలా మొత్తం రూ. 9,37,485 నిధులను వెచ్చించనున్నది.
11 ఏరియాల్లో సింగరేణి యాజమాన్యం నిర్వహిస్తున్న ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాల్లో వివిధ క్రీడల్లో మొత్తం 1225 మంది 18 ఏండ్లలోపు సింగరేణి ఉద్యోగుల పిల్లలు, ఇతరులు శిక్షణ పొం దుతున్నారు. వాలీబాల్లో 240 మంది, పుట్బాల్లో 300, బాస్కెట్బాల్లో 140, అథ్లెటిక్స్లో 200, హాకీలో 25, ఆర్చరీలో 20, హ్యాండ్బాల్లో 20, ఉషూలో 40, డ్రాయింగ్లో 45, కరాటేలో 50, కిక్బాక్సింగ్లో 45, బాక్సింగ్లో 100 మంది చొప్పున మొత్తం 1,225 మంది సింగరేణి ఉద్యోగుల పిల్లలు ఉచిత శిక్షణ పొందుతున్నారు.
ఈ కాలంలో పిల్లలకు సెలవులు వచ్చాయంటే చాలు ఇంట్లో టీవీలకు అతుక్కుపోవడమో, లేకుంటే అదే పనిగా సెల్ఫోన్లు చూడడమో చేస్తున్నారు. కనీసం సమయానికి తినాలనే ఆలోచన లేకుండా గడుపుతుంటారు. ఈ తరుణంలో సింగరేణి యాజమాన్యం వేసవి క్రీడా శిబిరాలు ఏర్పా టు చేసి, ఉద్యోగుల పిల్లలకు ఉచిత శిక్షణ ఇవ్వడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు ఆటలు ఆడడంతో మానసికోల్లాసం, దేహదారుఢ్యం పెంపొందుతుంది. క్రమశిక్షణ అలవడి వ్యక్తిత్వ వికాసం పొందుతున్నారు. ఆటల్లో మెళకువలు నేర్చుకుంటూ తమ క్రీడా భవితకు బాటలు వేసుకుంటున్నారు.
మాది భూపాలపల్లి పట్టణం. సింగరేణి నిర్వహిస్తున్న వేసవి ఉచిత క్రీడా శిబిరాల్లో విద్యార్థి దశ నుంచే వివిధ ఆటల్లో శిక్షణ పొందా. ఫుట్బాల్ నేర్చుకొని కోచ్గా ఎదిగా. మా తండ్రి కల్యాణ్ భూపాలపల్లి ఏరియాలోనే ఉద్యోగం చేస్తున్నాడు. 2018 డోర్నకల్లో జరిగిన అండర్-20 ఫుట్బాల్ పోటీల్లో నేను ఆడిన జట్టు తృతీయ స్థానంలో నిలిచింది. ఇదే సంవత్సరం ఒడిశాలో జరిగిన అండర్-21 ఫుట్బాల్, టెన్నిస్ జాతీయస్థాయి పోటీల్లో సింగిల్స్ విభాగంలో ద్వితీయ స్థానంలో నిలిచా. ఇక్కడే నేర్చుకొని, ఇక్కడే కోచ్గా పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. నేను ఆటల్లో రాణించేందుకు శిక్షకులు రవి, తిరుపతి, శ్రీనివాస్ ఎంతగానో ప్రోత్సహించారు. సింగరేణి యాజమాన్యానికి కృతజ్ఞతలు.
– నెల్లి శ్యాం, కోచ్
మాది భూపాలపల్లి పట్టణం. మేం కవలలం. మాకు ఆటలు ఆడటమంటే ఎంతో ఇష్టం. సింగరేణి సంస్థ నిర్వహిస్తున్న వేసవి ఉచిత క్రీడా శిక్షణ శిబిరంలో తర్ఫీదు పొందుతున్నాం. మాకు ఫుట్బాల్ అంటే ఇష్టం. ఈ క్రీడలో కోచ్లను అడిగి మెళకువలు నేర్చుకుంటున్నాం. 2021లో ఖమ్మంలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్-12 పరుగు పందెం, లాంగ్జంప్లో అశ్వన్తేజ్ పాల్గొన్నాడు. ఇక్కడ ఫుట్బాల్ చాలా బాగా నేర్పుతున్నారని, ఆర్మీలో చేరి సైనికుడిని ఆవుతానని అశ్వన్ అంటున్నాడని విశ్వన్ చెబుతున్నాడు.
– అశ్వన్తేజ్, విశ్వన్తేజ్
క్రీడలు నేర్చుకొన్నవారు ఎవరైనా సరే జీవితంలో గెలుపు, ఓటములను సమానంగా స్వీకరిస్తారు. భూపాలపల్లిలో నాలుగు క్రీడల్లో పిల్లలకు శిక్షణనిస్తున్నాం. ఆటలు ఆడడంతో పిల్లల్లో ఉన్న భయం పోతుంది. క్రమశిక్షణ అలవడి, స్నేహభావం, దేహదారుఢ్యం పెంపొందుతుంది. నాయకత్వ లక్షణాలు వస్తాయి. చదువుల్లో చురుకుగా ఉంటారు. సింగరేణి యాజమాన్యం పిల్లలకు ఆటల్లో శిక్షణ ఇస్తూ ప్రోత్సహిస్తున్నది. తమ పిల్లలు ఆటలు నేర్చుకోవడానికి తల్లిదండ్రులు చొరవ చూపాలి.
– పర్స శ్రీనివాస్, స్పోర్ట్స్ సూపర్వైజర్, భూపాలపల్లి ఏరియా