కామారెడ్డి టౌన్, సెప్టెంబర్ 15: కామారెడ్డి జిల్లా పరిషత్ సమావేశం బుధవారం ఐదు గంటల పాటు సుదీర్ఘంగా సాగింది. జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ అధ్యక్షతన కలెక్టరేట్లో సమావేశపు మందిరంలో ని ర్వహించిన సమావేశంలో ఎజెండాలోని మొత్తం 59 అంశాలకు గాను పది అంశాలతో పూర్తిచేశారు. ప్రభు త్వం కోట్లాది రూపాయలను మంజూరు చేసినా.. అధికారుల నిర్లక్ష్యంతో పనుల్లో జాప్యం జరుగుతున్నదని పలువురు జడ్పీటీసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆర్అండ్బీ, ఇరిగేషన్ అధికారులు పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని సభ్యులు ఆరోపించారు. ఫారెస్టు అధికారులు ప్రభుత్వ చట్టాలు, జీవోలు అంటూ అభ్యంతరాలు తెలుపడంతో కోట్లాది రూపాయల బీటీ రోడ్డు పనులు నిలిచిపోతున్నాయని, దీంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని అన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని జడ్పీచైర్పర్సన్ దఫేదార్ శోభ సూచించారు. విప్ గోవర్ధన్ మాట్లాడుతూ.. సీఎం సహకారంతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. జిల్లాలోని ప్రతిగ్రామంలో 80 శాతం కరోనా వ్యాక్సినేషన్ను పూర్తిచేయాలని ఎమ్మెల్యే షిండే వైద్యారోగ్య శాఖ అధికారులకు సూచించారు. కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ మాట్లాడుతూ.. కొవిడ్ వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తయ్యేలా ప్రజా ప్రతినిధులు సహకరించాలని కోరారు. రాష్ట్రంలో రెండు కోట్ల మందికి టీకా వేసినందుకు కేక్ను కట్ చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం దొడ్డు రకం వడ్లు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇన్చార్జి అదనపు కలెక్టర్ వెంకటమాధవరావు మాట్లాడుతూ.. 2021-22 సంవత్సరానికి గాను ఈజీఎస్లో 82.94 పని దినాలను కల్పించి రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. పిట్లం, రామారెడ్డి జడ్పీటీసీ సభ్యులు శ్రీనివాస్రెడ్డి, దశరథ్రెడ్డి మాట్లాడుతూ.. దొడ్డు రకం యూరియాను సహకార సంఘాలకు, సన్న రకం యూరియాను ప్రైవేటు డీలర్లకు పంపుతున్నారని, ప్రైవేటు డీలర్లు అధిక ధరలకు యూరియాను విక్రయిస్తున్నారన్నారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారిణి భాగ్యలక్ష్మి తెలిపారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, డీఎఫ్వో నిఖిత, జడ్పీ సీఈవో సాయాగౌడ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఐదేండ్లకు ఒకసారి పరీక్ష..
అధికారులు ఇక్కసారి పరీక్ష పాస్ అయితే సుమారు 35 ఏండ్లు సర్వీసులో ఉంటారని, తాము అలా కాదని విప్ అనడంతో సభ్యులు చప్పట్లతో మద్దతు తెలిపారు. అటవీ అధికారుల చర్యలతో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయని, దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూనే.. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని సూచించారు.