కవాడిగూడ : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సమగ్ర అభివృద్ది జరుగుతున్నదని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వారు అభివృద్ది పనుల్లో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ మేరకు శుక్రవారం భోలక్పూర్ డివిజన్ ఎస్కే పాయింట్ నుంచి శేఖర్రెడ్డి దవాఖాన వరకు రూ. 14 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు, అదే విధంగా సుప్రీం హోటల్ నుంచి కత్నీకాంఠ వరకు రు. 16 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన స్థానిక కార్పొరేటర్ మహ్మద్ గౌసొద్దీన్ తహతో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ భోలక్పూర్ డివిజన్లో శిథిలమైన తాగునీటి, డ్రైనేజీ పైప్లైన్లను తొలగించి, రూ. 20 కోట్లతో నూతన పైప్లైన్ నిర్మాణ పనులను పూర్తి చేసి కలుషిత నీటి సమస్యకు శాశ్వత పరిష్కార చర్యలు తీసుకున్నామని అన్నారు.
అదే విధంగా దఫాల వారిగా సీసీ రోడ్డు, వీడీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నామని అన్నారు. భోలక్పూర్లో జరుగుతున్న అభివృద్ది పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం అభివృద్దికి పెద్దపీట వేస్తున్నదని, రాజకీయాలకు అతీతంగా అభివృద్దిలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈ సన్నీ, ఏఈ తిరుపతి, టీఆర్ఎస్ నగర విభాగం నాయకుడు ముఠా జయసింహ, టీఆర్ఎస్ భోలక్పూర్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ బింగి నవీన్కుమార్లతోపాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.