-వాడవాడలా రెపరెపలాడిన గులాబీ జెండా..
-డివిజన్ లలో జోరుగా పార్టీ పతాకాల ఆవిష్కరణ..
జూబ్లీహిల్స్ జోన్ బృందం : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, టీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపినాథ్ ఆదేశాలతో పార్టీ శ్రేణులు వాడవాడలా వేడుకగా పార్టీ పతాకాలు ఎగురవేశారు.
టీఆర్ ఎస్ పార్టీ 21 వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒక్కో డివిజన్ లో 20 చొప్పున పార్టీ పతాకాలు ఎగురవేయడంతో గులాబీ జెండాలు రెపరెపలాడాయి. ఆయా డివిజన్లలో కార్పొరేటర్లు స్థానిక టీఆర్ ఎస్ నాయకులతో, కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాలను ఆవిష్కరించారు. రహ్మత్ నగర్ డివిజన్ లో కార్పొరేటర్ సీఎన్ రెడ్డి 20 ప్రాంతాలలో స్థానిక నాయకులతో కలిసి టీఆర్ ఎస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.
జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ -10 లో కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్ నాయకులతో కలిసి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. వెంగళరావునగర్ డివిజన్ లో పార్టీ నాయకులతో కలిసి కార్పొరేటర్ దేదీప్య విజయ్ 18 ప్రాంతాలలో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. బోరబండ డివిజన్ లో నగర మాజీ డిప్యూటీ మేయర్ , కార్పొరేటర్ బాబాఫసియుద్దీన్ నాయకులతో కలిసి 21 చోట్ల పార్టీ జెండాలను ఆవిష్కరించారు.
ఎర్రగడ్డలో టీఆర్ ఎస్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ ఆధ్వర్యంలో పలుచోట్ల పార్టీ జెండాలను ఆవిష్కరించిన అనంతరం మోతీనగర్ మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. మాదాపూర్ లోని హెచ్ ఐసీసీ లో జరుగుతున్న పార్టీ ప్లీనరీ సమావేశంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ నాయకత్వంలో కార్పొరేటర్లు సీఎన్ రెడ్డి, రాజ్ కుమార్ పటేల్ , దేదీప్య విజయ్ లతో పాటు పలువురు కార్పొరేటర్లు, నాయకులు తరలివెళ్లారు.