వరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 1: ఎంజీఎం దవాఖానలో రోగిని ఎలుకలు కొరికిన ఘటనకు బాధ్యులెవరినీ వదిలే ప్రసక్తే లేదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. కలెక్టర్ గోపి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) రమేశ్రెడ్డితో కలిసి శుక్రవారం ఎంజీఎం దవాఖానను పరిశీలించారు. ఆర్ఐసీయూలో చికిత్స పొందుతున్న బాధితుడు శ్రీనివాస్ కుటుంబసభ్యులతో మాట్లాడి వైద్యసేవలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం అకడమిక్ హాల్లో విలేకరులతో మాట్లాడుతూ.. కరోనా కాలంలో రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎంజీఎంలో ఇలాంటి ఘటన జరుగడం బాధాకరమన్నారు. మెరుగైన చికిత్స కోసం బాధితుడిని హైదరాబాద్లోని నిమ్స్కు తరలించినట్లు చెప్పారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం పోకుండా ఉండాలంటే ప్రభుత్వం కఠినంగా వ్యవహరించక తప్పదన్నారు. ఇప్పటి వరకు కేవలం ప్రాథమిక విచారణ ఆధారంగానే చర్యలు తీసుకున్నామని, పూర్తిస్థాయి నివేదిక అనంతరం బాధ్యులందరిపై కఠిన చర్యలు తప్పవని చెప్పారు. ఆర్ఐసీయూలో అనస్థీషియా విభాగాధిపతుల నిర్లక్ష్యం ఉంటే వదిలేది లేదన్నారు. ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని, అందుకే ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే బాధ్యులపై చర్యలు తీసుకున్నదని వివరించారు. సమస్య ఎప్పటి నుంచి ఉందో పరిశీలిస్తున్నామని, శానిటేషన్ కాంట్రాక్టు సంస్థను బ్లాక్ లిస్ట్లో పెడుతామన్నారు.
ప్రాథమిక నివేదిక ఆధారంగా ఆర్ఐసీయూ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకున్నామని, స్టేట్ శానిటేషన్ పాలసీని ప్రతి హాస్పిటల్లో అమలు చేస్తామని డీఎంఈ డాక్టర్ రమేశ్రెడ్డి చెప్పారు. త్వరలోనే తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎంఎస్ఐడీసీ) రిపోర్టు ఆధారంగా తగిన చర్యలు చేపట్టి, ఎంజీఎం దవాఖాన అవసరాలకు తగినట్లుగా మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. విధులకు ఆలస్యంగా వచ్చినా, హాజరు కాని వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు.
ఎంజీఎం దవాఖానకు సాత్విక్ రూరల్ అండ్ యూత్ ఇంటిగ్రేటెడ్ అసోసియేషన్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(గెయిల్) సుమారు రూ. 3కోట్ల విలువైన యంత్ర పరికరాలను అందజేశాయి. మంత్రి దయాకర్రావు చేతుల మీదుగా సంస్థ ప్రతినిధులు ఎం జీఎం అధికారులకు అందించారు. 17 రకాల 63 పరికరాలను అందించిన సంస్థ నిర్వాహకులను మంత్రి అభినందించారు. ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.