మణికొండ : నగర శివారు ప్రాంతంలోని నార్సింగి మున్సిపాలిటీ శ్రీ చైతన్య ఐఐటీ అకాడమి క్యాంపస్లో కరోనా కలకలం రేపుతోంది. మంగళవారం 180 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయగా 14 మందికి కోవిడ్ సోకినట్లు అధికారులు నిర్థారించారు. దీంతో అప్రమత్తమైన కళాశాల యాజమాన్యం బుధవారం మరో 93 మందికి పరీక్షలు చేశారు.
కాగా మరో 18 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేల్చారు. కళాశాలలోని ఐఐటీ అకాడమీలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్తో పాటు అందరికీ పరీక్షలు నిర్వహించారు. అనంతరం విద్యార్థుల తల్లితండ్రులను పిలిపించి పాజిటివ్ నమోదైన విద్యార్థులను వారి ఇండ్లకు పంపించారు.
అయితే బుధవారం కరోనా పాజిటివ్ వచ్చిన విద్యార్థులందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలకు రక్త నమూనాలను సేకరించినట్లు వైద్య అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఆర్టీపీసీఆర్ రిపోర్టులో పాజిటివిటీ నమోదుశాతాన్ని బట్టి ఒమిక్రాన్ పరీక్షలు చేయిస్తామని ఆయన వెల్లడించారు. కరోనా పాజిటివిటీ పెరుగుతున్న నేపథ్యంలో నార్సింగిలోని శ్రీ చైతన్య కళాశాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.