సికింద్రాబాద్ : సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు అండగా నిలబడుతోందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. మంగళవారం కాకాగూడ, బాలంరాయి, రసూల్పురా ప్రాంతాలకు చెందిన 11 మంది లబ్ధిదారులకు మంజూరైన సుమారు రూ.3 లక్షల 92 వేల విలువగల చెక్కులను కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే సాయన్న లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ నియోజకవర్గంలోని పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్టు తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అందుతున్న డబ్బులతో పేదలకు కార్పొరేట్ వైద్యం అందుకునే వీలు కలుగుతుందన్నారు. పేదల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.
కార్పోరేట్కు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందు చూపుతో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు. కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యుడు ప్రభాకర్, నేతలు టీఎన్ శ్రీనివాస్, నివేధితా, సదానంద్గౌడ్, మురళీయాదవ్, తేజ్పాల్, సంతోష్, సాంబ ఆశోక్ తదితరులు పాల్గొన్నారు.