ఖైరతాబాద్ : పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే సీఎం కేసీఆర్ సంకల్పమని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. ఖైరతాబాద్లోని మహాభారత్నగర్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ పి. విజయా రెడ్డి, హైదరాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ కె. ప్రసన్న రామ్మూర్తితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా స్వయంగా వైద్య పరీక్షలను చేయించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉచిత వైద్యం పేదలందరి దరికి చేర్చేందుకు బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. నగరంలో నేడు జీహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాటు చేసిన32 నూతన దవాఖానలు అందుబాటులోకి వస్తున్నాయని 226 విజయవంతంగా నడుస్తున్నాయని, తాజాగా 32 ఏర్పాటు చేశామని, మరో 35 కోసం స్థలపరిశీలన జరుగుతున్నదన్నారు.
ఖరీదైన వైద్యం చేయించుకోలేని పేదల వద్దకే వైద్యాన్ని తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో బస్తీ దవాఖానలను నెలకొల్పా మన్నారు. సాదారణ జబ్బులతో పాటు మధుమేహం, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు సైతం ఉచితంగా మందులను అందచేస్తున్నామన్నారు. ఇటీవల టెలీ కన్సల్టేషన్ సౌకర్యం కూడా కల్పించామన్నారు.
పేద ప్రజల కోసం బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే దానం నగేందర్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించా రన్నారు. పేదలు ఎక్కువ నివసించే ప్రాంతాల్లో ఈ బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశామని, ప్రజలు దానిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
త్వరలోనే ఖైరతాబాద్లో నిర్మించిన 50 పడకల ప్రభుత్వ దవాఖాన ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావుతో మాట్లాడానని తెలిపారు. అన్ని రకాల పరీక్షలతో పాటు అధునిక సిటీ స్కాన్ లాంటి పరీక్షలు సైతం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, మంత్రి హరీశ్ రావు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చేతుల మీదుగా ఈ దవాఖాన ప్రారంభం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ సర్కిల్ 17 డిప్యూటీ కమిషనర్ వంశీకృష్ణ, ఏఎంవోహెచ్ డాక్టర్ భార్గవ్ నారాయణ, కార్డియాలజిస్ట్ డాక్టర్ రఘు, ఎంఎస్ మక్తా పీహెచ్సీ డాక్టర్ సువర్ణ, బస్తీ దవాఖాన వైద్యులు డాక్టర్ ఆంజనేయులు, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు అరుణ్ కుమార్, నాయకులు వైల ప్రవీణ్ కుమార్, గజ్జెల అజయ్, గజ్జెల రమేశ్, సత్యనారాయణ, మహేశ్ యదవ్, శ్రీనివాస్ యదవ్, కరాటే రమేశ్ తదితరులు పాల్గొన్నారు.