రవీంద్రభారతి : భారత దేశం అంటే రాష్ట్రాల సమూహం అని, మనది ఫెడరల్ వ్యవస్థ కలిగిన దేశమని పేర్కొన్నారు. రాష్ట్రాల ఆర్థిక స్వావలంబనను కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని తెలంగాణ ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు.
రాజ్యాంగ స్ఫూర్తిని తూట్లు పొడుస్తూ దేశ పాలకులు అవలంభిస్తున్న ధోరణిని ఎండగట్టాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంద న్నారు. భారతదేశ ప్రజలకు ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొని యాడారు. భారత రాజ్యాంగంలో పొందపరిచిన అర్టికల్ 3తోనే తెలంగాణరాష్ట్రం ఆవిర్బవించిందని ఆయన పేర్కొన్నారు.
శుక్రవారం రవీంద్రభారాతిలో ఎస్సీ,ఎస్టీ మేధావుల జాతీయ ఫోరం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా బి.వినోద్కుమార్, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావులు విచ్చేశారు.
అనంతరం వినోద్కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ వాటిని పూర్తి స్థాయిలో ప్రవేటీకరిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ఉద్యోగాలను హరించే చర్యలు జోరుగా సాగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు ఏమాత్రం మంచిది కాదన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత దేశంలోని ప్రతి పౌరునిపై ఉందన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందపరిచిన అర్టికల్ 3ను పొందపరుచకుంటే మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని ఆయన చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పరిపాలన చేపట్టినపుడు ప్రతి సంవత్సరం నవంబర్ 26ను రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహిస్తానని ప్రకటించి, ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా నిర్వహించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతోనే బడుగుబలహీన వర్గాలు తమ హక్కులను సాధించుకోగల్గుతున్నాయని, అలాంటి మహానుభావుడిని ఎన్నటికీ మరువకూడదన్నారు.
ఎస్సీ,ఎస్టీ మేధావుల ఫోరం రాష్ట్ర చైర్మన్ ఆరేపల్లి రాజేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఫోరం జాతీయ నాయకులు మురళీదర్శన్, నర్సింహా, బ్రాహ్మనాథరావు, సెక్రటెరియట్ డివైఎస్ఓ అధికారి ఎస్.భవాని, సాయిత్రీబాయి పూలే వ్యవస్థాపక అధ్యక్షురాలు బెల్లమాధవి,డా.పి.లక్ష్మయ్య, సాయి దుగ్ని తదితరులు పాల్గొన్నారు.