నిర్మల్ అర్బన్, మార్చి 31 : పంజాబ్ తరహాలో కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలోని వడ్ల కొనుగోళ్లపై కేంద్రం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సభ్యులు తీర్మానం చేశారు. నిర్మల్ను అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చేశామని, రానున్న రోజుల్లో మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని చెప్పారు. వేసవిలో పట్టణంలో నీటి ఎద్దడి లేకుండా రూ.42కోట్లతో ఐదు ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించి ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నామని చెప్పారు. రూపాయికే నల్లా కనెక్షన్ను అందిస్తున్నామని వెల్లడించారు. పట్టణ అభివృద్ధికి టీయూఎఫ్ఐడీసీ ద్వారా రూ.23 కోట్లు వచ్చాయని వాటి వినియోగానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. జిల్లాలో రూ.35 కోట్ల నిధులతో సైన్స్ అండ్ టెక్నాలజీ రూపొందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. హరితహారం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందని, హరిత నిధికి ప్రతి ఒక్కరూ తమ వంతు తోడ్పాటునందించాలని కోరారు. ఏప్రిల్ నుంచి ఉద్యోగుల వేతనంలో కొంత ప్రభుత్వం తీసుకోనుందన్నారు. జూన్లో కలెక్టరేట్ భవనం ప్రారంభించనున్నట్లు తెలిపారు.
కలెక్టరేట్ ఎదుట నిర్మల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమాల్లో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, నాయకులు ముడుసు సత్యనారాయణ, పూదరి నరహరి, శానిటరీ ఇన్స్పెక్టర్ మురారి, ఆయా వార్డుల కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
నిర్మల్ టౌన్, మార్చి 31: నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో వచ్చే 20 ఏళ్లలో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని యాక్షన్ ప్లాన్ రూపొందించాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సూచించారు. మున్సిపాలిటీల్లో చేపట్టే మాస్టర్ ప్లాన్ పునరుద్ధరణ పనులపై జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో బృహత్ ప్రణాళిక చేపట్టి ప్రజలకు మెరుగైన వసతులు కల్పించాలని సూచించారు. వసతులతో పాటు రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డుకు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ప్రజల అభిప్రాయాలు, సూచనలను పరిగణనలోకి తీసుకొని అన్ని మున్సిపాలిటీలను ఆదర్శ పురపాలక సంఘాలుగా తీర్చిదిద్దాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, కమిషనర్ సత్యనారాయణరెడ్డి, అధికారులు శంకరయ్య తదితరులు ఉన్నారు.