ఖైరతాబాద్ : జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంపై దాడి చేసి పవిత్రమైన సభను ధ్వంసం చేసిన బీజేపీ కార్పొరేటర్లు, కార్య కర్తల చర్యలు హేయమైందని ఎమ్మెల్యే దానంనాగేందర్ అన్నారు. ఖైరతాబాద్లో కల్యాణలక్ష్మీ, షాదిముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ జీహెచ్ఎంసీ కార్యాలయంపై దాడిని ఖండించారు.
ప్రజాప్రతినిధులుగా ప్రజా సమస్యలపై చర్చించేందుకు అనేక వేదికలు ఉన్నాయని, కాని పవిత్రమైన ఆ సభలో సభ్యు లుగా ఉండి దానినే కించపర్చడం దారుణమని, వారిని అనర్హులుగా ప్రకటించాలన్నారు. ప్రజల మనోభావాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఆ కార్యాలయం ప్రధాన కేంద్రమని, అలాంటి స్థలంలో గౌరవహీనంగా వ్యవహరించారన్నారు.
ఈ చర్యలకు బాధ్యులైనవారు తమ పదువులకు రాజీనామా చేయాలని, లేదా బేషరతుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండు చేశారు. కార్పొరేటర్ పి.విజయారెడ్డి మాట్లాడుతూ జీహెచ్ఎంసీ కార్యాలయంపై బీజేపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు చేసిన దాడులు సరికాదన్నారు.
ప్రజల మధ్య ఉండి వారి సమస్యలు పరిష్కరించే వారే కార్పొరేటర్లని, చట్ట సభలను వారు కించపర్చడం బాధ్యతా రాహిత్యమన్నారు. ప్రజా ప్రతినిధులుగా కాదు, ప్రజల హక్కులను కూడా తెలుసుకొని వారికి మేలు చేసే విధంగా వ్యవహరించాలని, వారికి అగ్రనాయకత్వం హితబోధ చేయాలని సూచించారు.