ఎదులాపురం, అక్టోబర్ 1 : వయోవృద్ధులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా శనివారం ఆదిలాబాద్లోని జడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వయోవృద్ధుల వారోత్సవాల సందర్భంగా ర్యాలీలు, నడక, పరుగు పోటీల్లో వృద్ధులు పాల్గొనడం అభినందనీయమన్నారు. వయోవృద్ధుల సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా సంక్షేమాధికారి లేదా రెవెన్యూ డివిజనల్ అధికారులకు విజ్ఞాపన అందించవచ్చని తెలిపారు. జిల్లాలో వయోవృద్ధుల భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని ఆర్డీవోను ఆదేశించారు.
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ జిల్లాలో 37,576 మందికి వృద్ధాప్య పింఛన్ల కింద ప్రతి నెలా రూ.75 కోట్లు తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్నదని తెలిపారు. వృద్ధులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నదన్నారు. వయోవృద్ధుల సంరక్షణ కోసం చట్టాలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. భవన నిర్మాణానికి సహకరిస్తామన్నారు. అనంతరం వయోవృద్ధులను పూలమాల వేసి శాలువాలతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. టోల్ ఫ్రీ నంబర్కు సంబంధించి బ్యాండ్లు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, వయోవృద్ధుల సంక్షేమ జిల్లా అధ్యక్షుడు దేవీదాస్ దేశ్పాండే, ఆర్డీవో రాథోడ్ రమేశ్, డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్, డీఈవో ప్రణీత, వయోవృద్ధుల సంక్షేమ సంఘ ప్రతినిధి సుధాకర్, లింగారెడ్డి, దేవన్న పాల్గొన్నారు.
నిర్మల్ టౌన్, అక్టోబర్ 1 : వయోవృద్ధుల చట్టాలపై అవగాహన కల్పించాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమలో డీఆర్డీవో విజయలక్ష్మి, బాసర ట్రిపుల్ఐటీ వీసీ వెంకటరమణ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఆర్డీవో తుకారాం, పింఛనర్ల సంఘం అధ్యక్షుడు లింగన్న, వయోవృద్ధులు పాల్గొన్నారు.
నిర్మల్ చైన్గేట్, అక్టోబర్ 1: వయో వృద్ధుల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా సంక్షేమ అధికారిణి విజయలక్ష్మి అన్నారు. నిర్మల్లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వయోవృద్ధులు సమాజ సేవలో భాగస్వాములు కావాలన్నారు. ఏమైనా సమస్యలుంటే 14567 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. యోగా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందన్నారు. వారోత్సవాల సందర్భంగా వృద్ధులకు పలు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. అనంతరం వయో వృద్ధులను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఆర్డీవో తుకారాం, ఎఫ్ఆర్వో మధుసూదన్రెడ్డి విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంసీ లింగన్న, ప్రధాన కార్యదర్శి హన్మంతరెడ్డి, సీడీపీవో నాగమణి, డీసీపీవో మురళి, రాజు, మూర్తి, సూపర్వైజర్ విజయగౌరి, పోషణ్ అభియాన్ కోఆర్డినేటర్ నిరంజన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.