జూబ్లీహిల్స్ : రానున్న వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. ఆదివారం రహ్మత్నగర్ డివిజన్ టి.అంజయ్య నగర్లో రూ.7.40 లక్షలతో చేపట్టనున్న తాగునీటి పైప్లైన్ పనులకు కార్పొరేటర్ సీఎన్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఇంటికీ 20 వేల లీటర్ల ఉచిత తాగునీటి సౌకర్యాన్ని కల్పించిందని అన్నారు. గత ప్రభుత్వాల హయంలో ప్రజల బాగోగులు పట్టించుకున్న వారు లేరని.. ఈ ప్రాంతంలో ప్రజలు బిందెలు పట్టుకుని గుక్కెడు నీళ్ళ కోసం ఇబ్బందులు పడే వాళ్ళని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఆ ఇబ్బందులు కనుచూపు మేరలో కానరావడంలేదని అన్నారు. దీంతో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు మన్సూర్, కార్యదర్శి భాస్కర్, నాయకులు ముబీన్, మహేష్, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.