కలెక్టర్ శర్మన్చౌహాన్
నాటిన మొక్కలను గాలికి వదిలేస్తే ఎలా?
హరితహారం అమలులో నిర్లక్ష్యాన్ని వీడాలి
ఆకస్మిక తనిఖీలో అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
కోడేరు, జూలై 28: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తెలంగాణకు హరితహారం పథకంలో భాగంగా నాటిన మొక్కలు ఎండిపోతే చర్యలు తీసుకుంటామని అధికారులను కలెక్టర్ శర్మన్చౌహాన్ హెచ్చరించారు. బుధవారం కోడేరు మండలంలోని పసుపుల, కోడేరులో హరితహారం పథకంలో భాగంగా ఇటీవల నాటిన మొక్కలను పరిశీలించారు. పసుపుల శివారులో ప్రధాన రహదారిపై నాటిన మొక్కలు అప్పుడే ఎండిపోతున్నాయని మండల స్థాయి అధికారులు సర్పంచులు ఏం చేస్తున్నారని ఎంపీడీవో శంకర్నాయక్, పంచాయతీ కార్యదర్శి యాదగిరిఆచారిపై మండిపడ్డారు. మొక్కలు ఎండిపోతున్నందున పసుపుల గ్రామ పంచాయతీకి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. కోడేరు ఊరకుంటకట్టపై మొక్కలు నాటి గుంతలు ఎందుకు పూడ్చలేదని ప్రశ్నించారు. నాటిన ప్రతిమొక్కకూ కంచెను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటి వరకు మండలంలో ఎన్ని మొక్కలు నాటారు. ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యం ఎంత అని ఎంపీడీవోను ప్రశ్నించగా 6లక్షలకు పైగా మొక్కలను నాటాలని లక్ష్యాన్ని నిర్ధేశించగా నేటివరకు 25 శాతం మొక్కలను నాటామని సమాధానం ఇచ్చారు. దీంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం ఒక్క మొక్కకు రూ.350 ఖర్చు పెట్టి తీసుకొస్తున్నదని, మీరేమో మొక్కలు నాటి వదిలేస్తున్నారని మండిపడ్డారు. ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఉద్యోగం నుంచి తొలగించాల్సి వస్తుందన్నారు. నాటిన ప్రతిమొక్కనూ సంరక్షించాలని లేకుంటే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
నాటిన మొక్కలకు కంచెను ఎందుకు ఏర్పాటు చేయలేదని ఊరకుంట కట్టపై మొక్కలకు ముళ్ల కంచెను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే ఉదయం 11:30 గంటలకు తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లి అధికారుల పనితీరును పరిశీలించారు. ఎంతమంది విధులకు ఎన్ని గంటలకు హాజరు అయ్యారని వాకబు చేశారు. రిజిస్ట్రేషన్ గదిలోకి వెళ్లి రిజస్ట్రేషన్లు ఎలా జరగుతున్నాయని రైతులను అడిగి తెలుసుకున్నారు. వివిధ కారణాలతో పట్టాలు కావడంలేదని కొంతమంది రైతులు కలెక్టర్కు విన్నవించారు. దీంతో స్పందించిన ఆయన రైతులు సమస్యలపై తన ఫోన్ నెంబర్కు నేరుగా మెసేజ్లు పెడితే తాను తాసిల్దార్కు ఫార్వర్డ్ చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం రైతులు చెప్పిన వివిధ సమస్యలను తెలుసుకున్నారు. మీసేవా కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ధేశించిన బోర్డులను పెట్టలేదని రైతులు విన్నవించగా కార్యాలయం పక్కన ఉన్న మీసేవా కేంద్రానికి వెళ్లి బోర్డులను ఏర్పాటు చేయాలని సాయంత్రానికి బోర్డులను తనకు వాట్సాప్లో పెట్టాలని తాసిల్దార్ను ఆదేశించారు.