కొండపాటూరు వద్ద నిందితులతో మద్యం, బిందెలతో సారా పట్టివేత
కొల్లాపూర్/పెంట్లవెల్లి, జూలై 28: తెలంగాణ-ఆంధ్రా తెలుగు రాష్ర్టాల మధ్య ప్రవహిస్తున్న కృష్ణానదిపై మరబోట్లలో మద్యం, ప్లాస్టిక్ బిందెల్లో సారా రాత్రివేళ్లలో కొంతకాలంగా ఆంధ్రకు స్మగ్లింగ్ కొనసాగుతున్నది. పెంట్లవెల్లి మండలం మంచాలకట్ట పుష్కరఘాట్ నుంచి మరబోటులో మద్యాన్ని నదిపై ఆంధ్రాకు తరలిస్తుండగా నందికొట్కూర్ తాలూకా ముచ్చుమర్రి మండలం మూర్వకొండ గ్రామం వద్ద నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. ముచ్చుమర్రి ఎస్సై శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు కృష్ణానది అవతలి ఒడ్డున ప్లాస్టిక్ బిందెల్లో నిల్వచేసిన సారా, బస్తాల్లో నింపిన మద్యంతోపాటు తొమ్మిది మంది నిందితులను పట్టుకున్నారు. వీరిలో పెంట్లవెల్లి మండలం ఎంగంపల్లితండాకు చెందిన కృష్ణానాయక్, మంచాలకట్టకు చెందిన కుర్మయ్య, వెంకటనర్సింహతోపాటు ఆంధ్రాకు చెందిన మరో ఆరుగురిని ముచ్చుమర్రి పోలీసులు అరెస్టు చేశారు.
నదీతీరంలో పెట్రోలింగ్ చేస్తున్నాం
కొల్లాపూర్, పెంట్లవెల్లి మండలాల సరిహద్దులో ప్రవహిస్తున్న కృష్ణానదీ తీరం వెంట పోలీసు పెట్రోలింగ్ నిరంతరం కొనసాగిస్తున్నామని సీఐ వెంకట్రెడ్డి వివరణ ఇచ్చారు. ముచ్చుమర్రి వద్ద తెలంగాణకు చెందిన మద్యం, బిందెల్లో సారా నిందితులతో పోలీసులకు పట్టుబడిన ఘటనను గూర్చి సీఐ దృష్టికి తీసుకురాగా.. రాత్రి వేళ్లలో మరబోట్లలో ఆంధ్రకు మద్యం తరలిస్తున్నారని వివరణ ఇచ్చారు. నదీతీరంలో ఉన్న పుష్కరఘాట్ల వద్ద నిఘా పెంచుతామని చెప్పారు.