నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి కట్టడికి ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు డీజీపీ మహేందర్రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని, ఆ మేరకే స్పెషల్ డ్రైవ్ చేపట్టామని నల్లగొండ జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. గత నెల 15 నుంచి జిల్లాలో చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో 33 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ కేసుల్లో పట్టుబడిన వారిని విచారిస్తే ఈ దందా పూర్వపరాలకు సంబంధించిన కీలక సమాచారం లభించినట్లు తెలిపారు. సోమవారం నల్లగొండలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సమాచారం మేరకే నల్లగొండ జిల్లా నుంచి 17 ప్రత్యేక బృందాలను ఏఓబీకి పంపించి, ఈ నెల 15 నుంచి అక్కడ స్పెషల్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గంజాయిని రైతుల నుంచి సేకరిస్తూ ఇతర ప్రాంతాలకు తరలించే కీలకమైన వ్యక్తులను గుర్తించి పట్టుకుంటున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో విశాఖ రూరల్ చింతపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని లంబసింగి ఘాట్ వద్ద గంజాయితో సంబంధం ఉన్న వారి కోసం జిల్లా నుంచి వెళ్లిన మూడు బృందాలు సెర్చ్ చేస్తున్నాయన్నారు. విషయం తెలుసుకున్న గంజాయి స్మగర్లు సుమారు 25 మంది జీపులో కత్తులు, గొడ్డళ్లు, మారణాయుధాలు తీసుకొని పోలీసు టీమ్కు తారసపడ్డారని తెలిపారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణానికి ఆస్కారం లేకుండా పోలీసులు వెనక్కి తిరిగి వస్తున్న క్రమంలో స్మగ్లర్లు రోడ్డుకు అడ్డంగా టిప్పర్ పెట్టారన్నారు. పోలీసు వాహనాలపై దాడి చేసి జీపు అద్దాలు పగులగొట్టి, గొడ్డళ్లు, మారణాయుధాలతో దాడి చేయడానికి వస్తున్న క్రమంలో పోలీసులు తేరుకొని గాల్లోకి కాల్పులు జరిపారని తెలిపారు. ఒక స్మగ్లర్ తొడలో బుల్లెట్ గాయం కాగా మిగతా వారు పారిపోయారన్నారు. అందులో ఒకరిద్దరిని అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు తెలిపారు. ఇదంతా లోకల్ పోలీసులకు సమాచారం ఇచ్చాకే చేశామని వివరించారు. నల్లగొండ నుంచి వచ్చిన పోలీసులు డబ్బులు డిమాండ్ చేశారని దాడిలో గాయపడిన వ్యక్తి చేస్తున్న ఆరోపణలు అవాస్తమన్నారు. ఇప్పటి వరకు ఈ ఆపరేషన్లో 35 మందిని అరెస్టు చేసి, వందల కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
చట్టం ముందు నిలబెడుతాం
గంజాయి స్మగ్లర్లు ఏఓబీలోనే కాదు.. కశ్మీర్లో దాక్కున్నా పట్టుకుని చట్టం ముందు నిలబెడుతామని స్పష్టం చేశారు. గంజాయిని రవాణా చేసేందుకు విజయవాడ-హైదరాబాద్ మార్గాన్ని స్మగ్లర్లు కారిడార్గా ఎంచుకున్నట్లు తెలిపారు. అనేక సార్లు ప్రత్యేక తనిఖీలు చేపట్టగా ఇప్పటికే వెయ్యి కిలోలకు పైగా గంజాయి పట్టుబడిందని వివరించారు. గంజాయి మూలాలు విశాఖపట్నం, తూర్పు గోదావరి, విజయనగరం జిల్లాల సరిహద్దుతో కూడిన ఒడిశా బార్డర్లో ఉన్నట్లు గుర్తించామన్నారు. గంజాయిని ఏపీ నుంచి నల్లగొండ జిల్లా మీదుగా హైదరాబాద్, మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా, ఢిల్లీ తదితర ప్రాంతాలకు స్మగ్లర్లు చేరవేస్తున్నట్లు తమ విచారణలో వెల్లడైందన్నారు. దీన్ని పూర్తిగా అరికట్టాలంటే ఏఓబీలో కీలకంగా వ్యవహరిస్తున్న వారి ఆట కట్టించాలన్నదే తమ స్పెషల్ ఆపరేషన్ లక్ష్యమని ఎస్పీ రంగనాథ్ వెల్లడించారు. వైజాక్ రూరల్ జిల్లా ఎస్పీ కేశవరావు, పశ్చిమ గోదావరి ఎస్పీతో మాట్లాడి జిల్లాకు చెందిన ఒక ఏఎస్పీ ఈ ఆపరేషన్లను సమన్వయం చేస్తున్నట్లు తెలిపారు.