సేంద్రియ ఎరువులతో జీపీలకు ఆదాయం
డీపీవో నారాయణ
సర్పంచ్లు, కార్యదర్శులకు అవగాహన
దండేపల్లి, జూన్17 : తడి చెత్తతో సేంద్రియ ఎరువుల తయారీతో పంచాయతీలకు అదనపు ఆదాయం సమకూరుతుందని డీపీవో నారాయణ, ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం నెల్కివెంకటాపూర్లో సెగ్రిగేషన్ షెడ్డులో వానపాముల ద్వారా సేంద్రియ ఎరువుల తయారీపై మండలంలోని సర్పంచ్లు, జీపీ కార్యదర్శులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీలను చెత్త రహితంగా తీర్చిదిద్దాలన్నారు. సేంద్రియ ఎరువులను తయారు చేసి రైతులకు తక్కువ ధరకే విక్రయించాలన్నారు. జీపీలకు ఆదాయం సమకూరేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో మేఘమాల, ఎస్బీఎం రాజేందర్, రిసోర్స్ పర్సన్ వెంకటి, గ్రామ కార్యదర్శి ప్రియాంక, తదితరులు పాల్గొన్నారు.
సేంద్రియ ఎరువులపై అవగాహన
జన్నారం, జూన్ 17 : మండల కేంద్రంలోని పొనకల్ డంప్ యార్డు వద్ద సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు ఎంపీడబ్ల్యూ ఆధ్వర్యంలో వానపాముల ద్వారా సేంద్రియ ఎరువుల తయారీపై ఎంపీడీవో అరుణారాణి అవగాహన కల్పించారు. గ్రామాల్లో సేకరించిన చెత్త నుంచి సేంద్రియ ఎరువుల తయారీ, వాటి ద్వారా లాభాలు, పంచాయతీలకు ఆదాయంపై వివరించారు. ఈ కార్యక్రమంలో పొనకల్ సర్పంచ్ జక్కు భూమేశ్, ఎంపీవో రమేశ్, జాలంసింగ్, ఖలీం, గ్రామస్తులు పాల్గొన్నారు.