పాలకుర్తి, మే 17: కరోనా విపత్తు సమయంలో ఐఎంఎస్ పూర్వ విద్యార్థుల సంఘం తమ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నది. ప్రభుత్వ వైద్యశాలలకు చేయూతనందిస్తున్నది. పాలకుర్తి మండలం పుట్నూర్, పెద్దపల్లి మం డలం రాగినేడు పీహెచ్సీలకు ఐఎంఎస్ పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఆరు బెడ్లు, 15 బీపీ కిట్లు పంపిణీ చేసింది. ఐఎంఎస్ పూర్వ విద్యార్థులు ఐఏఎస్ పరికిపండ్ల నరహరి, స్వరణ్సింగ్, సమీర్బేగ్ ప్రోత్సాహంతో ఈప్రాంతంలో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు పూర్వ విద్యార్థులు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో కృపాబాయ్, డాక్టర్ మారుతి, సర్పంచులు మల్క కుమార్, పున్నం శారదాసాగర్, మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లం రాజయ్య, నిర్వాహకులు మల్క రామస్వామి, ఈసారపు సురేందర్, హేమలత, లియాఖత్ తదితరులు పాల్గొన్నారు.
ఎలిగేడు, మే 17: సుల్తాన్పూర్లో కరోనా పాజిటివ్ వచ్చిన 10 మందికి సోమవారం చేతన ఫౌండేషన్ వారు సమకూర్చిన మెడికల్ కిట్లను సర్పంచ్ అర్శనపల్లి వెంకటేశ్వరరావు అం దించారు. కిట్లలోని మందులను తప్పకుండా వాడాలని చెప్పారు. ఈ సందర్భంగా సర్పంచ్ కరోనా సోకిన వారితో మాట్లాడుతూ, ఇంట్లోనే ఉంటూ ఎవరికి వారు స్వీయ రక్షణతో కొవిడ్ నిబంధనలను పాటించాలని, ప్రధానంగా మాస్కులు ధరించాలని, అనవసరంగా బయట తిరగవద్దని సూచించారు. లాక్డౌన్ పరిమితులను ఉల్లంఘించవద్దని అవగాహన కల్పించారు. మెడికల్ కిట్లు తెచ్చి ఇచ్చిన డీ శ్రీనివాసరావును సర్పంచ్ అభినందించారు.
మంథని టౌన్, మే 17: పట్టణంలోని గంగాపురి, రాజీవ్నగర్, పద్మశాలీవాడ, మార్కెట్ ఏరియా, ముత్యాలమ్మవాడ, వాగుగడ్డ, లక్ష్మీనారాయణ ఆలయం, రావుల చెరువుకట్టల ఏరియాల్లో దాదాపు 25 కరోనా బాధిత కుటుంబాలకు మిత్ర బృందం సభ్యులు ఆహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంథని మిత్ర బృందం సభ్యులు మాట్లాడుతూ, ఆసక్తి ఉన్న దాతలు ముందుకు రావాలని కోరారు. మంథని మిత్ర బృందం సభ్యులను పలువురు ప్రత్యేకంగా అభినందించారు.
సుల్తానాబాద్ రూరల్, మే 17: సుల్తానాబాద్ మండలం కాట్నపల్లికి చెందిన నాలుగు కరోనా బాధిత కుటుంబాలకు చేతన ఫౌండేషన్ చేయూతనందించింది. వారికి మెడికల్ కిట్లు అందజేసింది. కిట్లు వచ్చేందుకు సామాజిక కార్యకర్తలు పొన్నాల ఆంజనేయులు, రాజుకుమార్, శ్రీనివాస్రావు కృషి చేశారు. వారికి బాధిత కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపాయి.
వలస కూలీలకు..
పెద్దపల్లి కమాన్, మే 17: సిర్పూర్ కాగజ్నగర్కు చెందిన నలుగురు కూలీల బాధలను నల్ల మనోహర్రెడ్డికి ఫోన్ ద్వారా తెలుపగా ఆయన స్పందించారు. వెంటనే వారికి కావాల్సిన నిత్యావసరాలను పంపించారు. ఈ సందర్భంగా నల్ల మనోహర్రెడ్డికి తాము రుణపడి ఉంటామని కూలీలు పేర్కొన్నారు.
ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు..
కోల్సిటీ, మే 17: కరోనా బాధితులకు ఆలయ ఫౌండేషన్ సభ్యులు అండగా నిలిచారు. ప్రస్తుతం ఆక్సిజన్ కొరత సమస్యను గుర్తించి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఐఏఎస్ అధికారి నరహరి కరోనా బాధితుల కోసం సోమవారం 9 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ను పంపించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు, 32వ డివిజన్ కార్పొరేటర్ ఐత శివకుమార్ మాట్లాడుతూ, పారిశ్రామిక ప్రాంతంలో కరోనా బారిన పడి, కోలుకున్నాక కూడా ఆక్సిజన్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సూచనల మేరకు తమ ఫౌండేషన్ ఆక్సిజన్ అందజేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో 60 మంది వైద్యులతో హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేశామని వివరించారు. ఇప్పటి దాకా 4 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్, 3 సిలిండర్లు సిద్ధంగా ఉంచామని తెలిపారు. ఎవరైనా శ్వాస సమస్యతో ఇబ్బంది పడుతుంటే నేరుగా వారి ఇంటికి వెళ్లి ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ద్వారా సేవలు అందిస్తున్నామని తెలిపారు.
అవసరం ఉన్న వారు హెల్ప్ లైన్ నంబరు 99494 46802కు ఫోన్ చేస్తే నేరుగా వారి ఇంటి వద్దకే వచ్చి ఆక్సిజన్ అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు దీట్ల రమేశ్బాబు, రాజేందర్, కీర్తి నాగార్జున, జంగా అనిల్ ఉన్నారు.
ఫర్టిలైజర్సిటీ, మే 17: కరోనా రోగులకు నిత్యం భోజనాలు సరఫరా చేస్తున్న మహర్షి కల ర్ ల్యాబ్ యజమాని శ్రీనివాస్కు సోమవారం గోదావరిఖని మర్చంట్ అసోసియేషన్ నాయకులు సహకారం అందించారు. అసోసియేషన్ సభ్యులు శ్రీనివాస్కు క్వింటాల్ బియ్యం, 5 కేజీల నూనె, కోడిగుడ్లు లక్ష్మీనగర్లోని వన్ టౌన్ ఎస్ఐ సతీశ్, మాజీ డిప్యూటీ మేయర్ ముప్పిడి సత్యప్రసాద్ చేతుల మీదుగా అందజేశారు. ఇక్కడ గోలి రమణారెడ్డి, భిక్షపతి, తిరుపతి, దయానంద్ గాంధీ, రాజేందర్, పొన్నం విజయ్కుమార్, నామని శ్రీనివాస్, తిరుపతి, మల్క సతీశ్, చంద్, బాలసాని సురేశ్, కోటగిరి శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.