ఖమ్మం లీగల్, జూన్ 16: జాతీయ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల ఆదేశాల మేరకు సత్తుపల్లిలో న్యాయ సహాయ కేంద్రాన్ని ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్కే భూపతి ఖమ్మం నుంచి ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ న్యాయసేవలు అందించేందుకు న్యాయసేవా సంస్థలకు లభించిన మరో ఉపకరణం న్యాయ సహాయ కేంద్రమని అభివర్ణించారు. ఈ కేంద్రం ద్వారా మారుమూల గ్రామాల ప్రజలకు, గిరిజనులకు న్యాయ సహాయం సత్వరంగా అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చదువురాని వారికి ఈ కేంద్రం ద్వారా న్యాయ సేవలు అందుతాయన్నారు. ఏదైనా నేరానికి సంబంధించి బాధిత వ్యక్తి పోలీసులకు రాతపూర్వక ఫిర్యాదు ఇవ్వలేనప్పుడు ఈ న్యాయసహాయ కేంద్రం ద్వారా తగిన సహాయం పొందవచ్చని న్యాయమూర్తి ఉదహరించారు. సత్తుపల్లి అదనపు జిల్లా జడ్జి సాయిభూపతి, న్యాయసేవా సంస్థ కార్యదర్శి మహ్మద్ అబ్దుల్ జావీద్ పాషా, సత్తుపల్లి జూనియర్ సివిల్ జడ్జిలు కే.యువరాజా, శ్రావణ స్వాతి తదితరులు పాల్గొన్నారు.