రెవెన్యూ, అటవీ భూమికి హద్దుగా రెండు మీటర్ల లోతు, వెడల్పుతో తవ్వకాలు
వన్యప్రాణుల దాహం తీర్చేందుకు సాసర్ పీట్ల ఏర్పాటు
తిర్యాణి, మే14 : తెలంగాణ ప్రభుత్వం అడవుల సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. గతంలో మాదిరిగా ఇండ్ల నిర్మాణం కోసం కలప, వంట చెరుకు కోసం ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు అడవిలోకి వెళ్లకుండా రెండేండ్ల క్రితమే రోంపల్లి, తిర్యాణి, మాణిక్యాపూర్, కొలాంగూడ, పంగిడిమాదరం, గిన్నేధరి, ఇర్కపల్లి, చెలిమెల, గంభీరావ్పేట, తదితర బీట్లలో రెవెన్యూ, అటవీ భూమికి హద్దుగా రెండు మీటర్ల లోతు, వెడెల్పుతో కందకాలు తవ్వించారు. దీంతో కలప అక్రమ రవాణాకు బ్రేక్ పడడమే కాకుండా అటవీ భూమూల ఆక్రమణలు తగ్గాయి. అంతేగాకుండా అడవుల్లో కొన్నిచోట్ల చెక్పోస్టులను సైతం ఏర్పాటు చేసి నిరంతరంగా గస్తీ నిర్వహిస్తున్నారు. అలాగే 350 హెక్టార్లకు పైగా (ANR) ప్లాంట్ ద్వారా సహజ సిద్ధంగా మొక్కలను పెంచుతున్నారు.
సీసీ కెమెరాల ఏర్పాటు..
మండలంలోని గిన్నేధరి, తిర్యాణి, అటవీ రేంజ్ పరిధిలో సుమారు 56 వేల హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయి. అలాగే వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వేసవిలో దాహం తీర్చేందుకు గిన్మేధరి, తిర్యాణి రేంజ్ల పరిధిలో 25 , 21 చొప్పున నీటి నిల్వకోసం సాసర్ పీట్లను ఏర్పాటు చేసి నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే నూతనంగా 20 నీటి కుంటలను తవ్వించారు. సహజ సిద్ధమైన 16 ఊట చెలిమెలు సైతం ఉన్నాయి. వన్యప్రాణులకు ఆహారం కోసం గడ్డి క్షేత్రాలను కూడా పెంచతున్నారు. తిర్యాణి, గిన్నేధరి రేంజ్ల పరిధిలో 15 హెక్టార్లు , 3.5 హెక్టార్లలో పండ్ల మొక్కలు పెంచుతున్నారు.
అడవుల సంరక్షణకు చర్యలు..
అడవులు, వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే అడవుల వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించాం. కందకాలు తవ్వడం వల్ల కలప అక్రమ రవాణాకు అడ్డుపడింది. అంతేగాకుండా పశువులు కూడా లోనికి వెళ్లడం లేదు. దీంతో మొక్కలు, వన్యప్రాణులకు ఎలాంటి హానీ లేదు. ప్రజలు కూడా సహకరించాలి. -శ్రీనివాస్ అటవీ రేంజ్ అధికారి, తిర్యాణి