ఓవైపు వైరస్ నియంత్రణకు చర్యలు
మరోవైపు కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు
ప్రభుత్వ దవాఖానల్లో సకల సదుపాయాలు
పెద్దపల్లి, మే 14 (నమస్తే తెలంగాణ): కరోనా రోజురోజుకూ విజృంభిస్తుండడంతో రోగులకు సర్కారు అండగా నిలుస్తున్నది. హోం ఐసొలేషన్లో ఉంటున్న వారికి అవసరమైన మందులు అందిస్తూనే.. ఇంటి వద్ద సౌకర్యం లేని వారికి కొవిడ్ కేర్ సెంటర్లలో వసతి కల్పిస్తున్నది. వ్యాధి తీవ్రతను బట్టి ప్రభుత్వ దవాఖానలకు తరలించి చికిత్స అందిస్తున్నది. కొవిడ్ నిర్ధారణ, చికిత్స వంటి అంశాలపై అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రతి రోజు కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యక్షంగా లేదంటే, జూమ్ యాప్లో సమావేశమై జిల్లాలోని పరిస్థితిని, పరీక్షలు, వ్యాక్సినేషన్, వైద్యం, సహాయం తదితర అంశాలపై వైద్యఆరోగ్యశాఖ అధికారుల నుంచి వివరాలు సేకరించడంతో పాటు వాటిని ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. జిల్లాకు అవసరమైన పరికరాలు, వైద్య సిబ్బంది, మందులు, రవాణా సౌకర్యాలు తదితర అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. మరోవైపు ప్రైవేట్ దవాఖానలకు అనుమతులివ్వడంతో పాటు సేవలు, ఫీజులపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నది. ఉమ్మడి జిల్లాలో పది ప్రభుత్వ దవాఖానల్లో 824 బెడ్స్ను అందుబాటులో ఉంచింది. ప్రభుత్వం అనుమతులిచ్చిన 90 ప్రైవేట్ దవాఖానాల్లో 2678 బెడ్స్ ఉన్నాయి.
జిల్లాలో..
పెద్దపల్లి జిల్లాలో కొవిడ్ బాధితులకు చికిత్స అందించేందుకు నాలుగు ప్రభుత్వ దవాఖానల్లో ఏర్పాట్లు చేశారు. సుల్తానాబాద్లోని టీబీ దవాఖానలో 40 పడకలు, గోదావరిఖని ప్రభుత్వ ఏరియా దవాఖానలో 50 పడకలు, సింగరేణి ఏరియా దవాఖానలో 100 పడకలు, ఎన్టీపీసీ ధన్వంతరి దవాఖానలో 10 పడకలు ఏర్పాటు చేయగా, అన్ని బెడ్స్కు ఆక్సిజన్ సౌకర్యం కల్పించారు. పెద్దపల్లి జిల్లా దవాఖానలో మరో 50 పడకలు అందుబాటులోకి తేవడంతో పాటు ఆక్సిజన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా దవాఖానలో 100 పడకలకు ఆక్సిజన్తో పాటు వెంటిలేటర్ సేవలు అందుబాటులోకి తెచ్చారు. ఇంకా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు.