హాలియా, ఏప్రిల్ 2 : నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజల దాహార్తి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతేడాది నియోజకవర్గ సమీక్షలో హాజరైన సీఎం కేసీఆర్ ట్యాంకుల నిర్మాణానికి రూ.12 కోట్లు మంజూరు చేశారు. దాంతో నియోజకవర్గ వ్యాప్తంగా 31 ఓవర్హెడ్ ట్యాంకులను నిర్మిస్తున్నారు. వాటి ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించేందుకు గ్రామీణ నీటిసరఫరాల శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
గతేడాది ఆగస్టులో నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రగతి సమీక్షా సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరు కాగా.. నియోజక వర్గంలోని పలు మండలాల్లో తాగునీటి ఎద్దడి గురించి ఎమ్మెల్యే నోముల భగత్ సీఎం దృష్టికి తీసుకు వచ్చారు. గుర్రంపోడు, పెద్దవూర, తిరుమలగిరి (సాగర్), అనుముల, త్రిపురారం మండలాల్లో ట్యాంకులు నిర్మించాలని కోరారు. ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ రూ. 12 కోట్లు విడుదల చేశారు.
సీఎం కేసీఆర్ విడుదల చేసిన రూ. 12 కోట్లతో ఐదు మండలాల్లోని 31 గ్రామాల్లో ఓవర్హెడ్ ట్యాంకులు నిర్మిస్తున్నారు. నాలుగు నెలల క్రితం నిర్మాణం ప్రారంభించగా ప్రస్తుతం పనులు పూర్తి కావచ్చాయి. వేసవిలో ప్రజలకు తాగునీరు అందించాలనే ఉద్దేశంతో పనులు వేగంగా పూర్తి చేశారు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో ట్యాంకులకు రంగులు వేస్తున్నారు. ఈ నెలలోనే ట్యాంకులను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటి ద్వారా పైప్లైన్లు వేసి ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా శుద్ధి చేసిన తాగునీటిని అందించనున్నారు.
ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మిషన్ భగీరథ కింద ఓవర్హెడ్ ట్యాంకులను నిర్మిస్తున్నాం. అన్ని ప్రాంతాల్లో ట్యాంకుల నిర్మాణం పూర్తికావచ్చాయి. ప్రస్తుతం రంగులు వేసే దశలో ఉన్నాయి. పనులు పూర్తి కాగానే ఓవర్హెడ్ ట్యాంకులను ప్రారంభిస్తాం.
-పి, మధు, మిషన్ భగీరథ డీఈ
నాగార్జునసాగర్ నియోజకవర్గవ్యాప్తంగా ప్రతి ఇంటికీ తాగునీటిని అందించి ప్రజల దాహార్తి తీర్చాలన్నదే లక్ష్యం. గతేడాది సీఎం కేసీఆర్ హాలియాకు వచ్చినప్పుడు విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాను. ఓవర్హెడ్ ట్యాంకుల నిర్మాణం కోసం రూ. 12 కోట్లు విడుదల చేశారు. పనులు కూడా పూర్తి కావచ్చాయి. త్వరలోనే ట్యాంకులను ప్రారంభిస్తాం.
-నోముల భగత్ కుమార్, ఎమ్మెల్యే, నాగార్జున సాగర్