ఆక్సిజన్ లెవెల్ తక్కువుంటే దవాఖానలో వైద్యసేవలు
జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాంకిషన్
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 11 : ధైర్యంతో కరోనాను జయించొచ్చని మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాంకిషన్ అన్నారు. మంగళవారం ఆయన తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కరోనా నిర్ధారణ అయినా, ఆక్సిజన్ లెవెల్ 94శాతం కంటే తక్కువగా ఉంటే వెంటనే వారిని అడ్మిట్ చేసి వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రభుత్వ సహకారంతో మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో 290 ఆక్సిజన్ పడకలను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో 230 ఆక్సిజన్ పైప్లైన్లు, 60 ఐసీయూ లైన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా 60 ఐసీయూ లైన్లకు వెంటిలేటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మూడు రోజుల నుంచి రోగులకు బెడ్ దొరకని పరిస్థితి ఉందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన వెంటనే మంత్రి శ్రీనివాస్గౌడ్ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా మరో 250 ఆక్సిజన్ పడకలను మంజూరు చేసినట్లు తెలిపారు.
రెండు రోజుల్లో మరో 250 ఆక్సిజన్ పడకలకు ఆక్సిజన్ పైప్ లైన్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు రావడంతో పనులు ప్రారంభమయ్యాని అన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న సౌకర్యాలను వినియోగించుకుంటూ కొవిడ్ హెల్త్ కేర్ సెంటర్ను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి రోగులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా వారికి వ్యాధి నిర్ధారణ వంటివి చేస్తూ, ఆర్టీపీసీఆర్, సీటీస్కాన్లలో వ్యాధి నిర్ధారణ అయిన వారికి వైద్యసేవలు అందుతున్నాయన్నారు. ఇప్పటివరకు 12వేల మందికి వైద్యసేవలు అందించామన్నారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణలోనే మొట్టమొదటి లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్ 13 కేఎల్ సామర్థ్యంతో ఇక్కడ ఏర్పాటు చేశారన్నారు. రెమిడెసివర్ ఇంజక్షన్లు ఇతర మెడిసిన్లు, ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారికి పౌష్టికాహారం అందజేస్తున్నట్లు తెలిపారు.