యాదాద్రి, అక్టోబర్10 : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ప్రతిష్ఠామూర్తులకు నిజాభిషేకం మొదలుకుని స్వామివారికి జరిగే నిత్య కైంకర్యాల్లో భక్తులు పాల్గొని తరించారు. పూజల అనంతరం స్వామివారిని దర్శించుకునే భక్తులు ఉదయం నుంచే క్యూ లైన్లలో నిలుచున్నారు. భక్తులు సువర్ణపుష్పార్చనలో పాల్గొని స్వామివారి వేద ఆశీర్వచనం తీసుకున్నారు. బాలాలయంలోని స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్యపూజలు జరిపారు. తెల్లవారుజామునే స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి ఆరాధిస్తూ పూజలు చేశారు. అనంతరం స్వామివారికి హారతి నివేదనలు అర్పించారు. బాలాలయం కల్యాణమండపంలో శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. స్వామివారి నిత్య తిరుకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలో ఊరేగించారు. లక్ష్మీ సమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ గంటన్నరకు పైగా కల్యాణతంతు జరిపారు. కల్యాణమూర్తులను ముస్తాబు చేసి బాలాలయం ముఖమండపంలో భక్తులకు అభిముఖంగా అధిష్టించి కల్యాణతంతు నిర్వహించారు. బాలాలయ ముఖ మండపంలో అష్టోత్తర పూజలు పెద్ద ఎత్తున జరిగాయి. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, అంజనేయ స్వామికి సహస్రనామార్చన చేశారు. సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. పూర్వగిరి(పాతగుట్ట)లో స్వామివారి నిత్యకైంకర్యాలు సంప్రదాయబద్ధంగా సాగాయి. అనుబంధ శివాలయంలో శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా అమ్మవారికి విశేష పూజలు చేశారు. శ్రీవారి ఖజానాకు రూ.16,30, 808 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.