Trisha | కథానాయికగా 21ఏళ్ల కెరీర్ త్రిషది. కథానాయికల్లో ఇంత లాంగ్విటీ చాలా అరుదు. ప్రస్తుతం ఈ చెన్నయ్ చందమామ చేతిలో అయిదు సినిమాలున్నాయి. అందులో మెగాస్టార్తో చేస్తున్న ‘విశ్వంభర’ ఒకటైతే, కమల్హాసన్తో చేస్తున్న ‘థగ్లైఫ్’ ఇంకొకటి. అలాగే, మోహన్లాల్తో ‘రామ్’, అజిత్తో ‘విదా ముయార్చి’, టోవినో థామస్తో ‘ఐడెంటిటీ’ చిత్రాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉన్నది త్రిష. మే4న ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా తన కెరీర్ ప్రారంభానికి ముందు అమ్మ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంది త్రిష. ‘అసలు నా లక్ష్యం వేరు. నటిని కావాలని ఎప్పుడూ అనుకోలేదు. మనం ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుంది. నా విషయంలోనూ అదే జరిగింది. హైస్కూల్ రోజుల్లో క్రిమినల్ సైకాలజీ చదవాలని కలలు కనేదాన్ని.
లాయర్ కావాలనేది నా ఆకాంక్ష. అయితే అనుకోకుండా పదహారేళ్ల వయసులోనే ‘మిస్ చెన్నయ్’ అయ్యాను. ఆ తర్వాత ‘మిస్ ఇండియా’ పోటీల్లోనూ పాల్గొన్నాను. గ్లామర్ ఫీల్డ్లో ఉండే కిక్ ఆ రెండింటివల్ల తెలిసొచ్చింది. నిదానంగా మోడలింగ్పై ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలోనే కొన్ని యాడ్ ఫిల్మ్స్లో కూడా నటించాను. అప్పడే ‘జోడీ’లో సిమ్రాన్ ఫ్రెండ్గా నటించే అవకాశం వచ్చింది. కేవలం పాకెట్ మనీ కోసం చేశాను. వెంటనే ఆఫర్లు రావడం మొదలైంది. నటించడానికి నాన్న ఓకే చెప్పినా.. అమ్మ మాత్రం ‘నో’ అన్నది. బతిమాలో, అలిగో ఎలాగొలా ఒప్పించాను. అప్పుడు అమ్మ చెప్పిన మాట నాకింకా గుర్తు.. ‘చూడూ.. నువ్వు బాధల్లేకుండా పెరిగావ్. కానీ సినిమాలంటే అన్నీ ఎత్తుపల్లాలే ఉంటాయి. తట్టుకోగలగాలి. రెండేళ్లు ప్రయత్నించు. నీ వల్ల కాకపోతే.. వచ్చి బుద్ధిగా చదువుకో..’ అని చెప్పింది. సరే అని కథలు విన్నాను. విజయాలు సాధించా.. సాధిస్తూనే ఉన్నా.’ అంటూ అందంగా నవ్వేసింది త్రిష.