ఇచ్చోడలో వ్యవసాయశాఖ, టాస్క్ఫోర్స్ తనిఖీలు
వివరాలు వెల్లడించిన ఉట్నూర్ డీఎస్పీ ఉదయ్ రెడ్డి
ఇచ్చోడ, జూన్ 10 : వ్యవసాయశాఖ, టాస్క్ఫోర్స్ అధికారులు బుధవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఇచ్చోడలోని ఫర్టిలైజర్ దుకాణాల్లో విస్తృతంగా నిర్వహించారు. తనిఖీల్లో అనుమతి లేని 3027 టెర్రా కంపెనీకి చెందిన పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉట్నూర్ డివిజన్ డీఎస్పీ ఉదయ్ రెడ్డి వివరాలు వెల్లడించారు. వ్యవసాయ, టాస్క్ఫోర్స్ అధికారులతో కలిసి ఇచ్చోడలో తనిఖీలు నిర్వహించామని చెప్పారు. తనిఖీల్లో టెర్రా కంపెనీకి చెందిన మూడు రకాల పత్తి విత్తనాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవన్నారు. ఆ కంపెనీకి కేవలం టమాటా విత్తనాలు విక్రయాలకు మాత్రమే ప్రభుత్వం నుంచి అనుమతులు ఉన్నాయన్నారు. నిబంధనలను విరుద్దంగా సదరు కంపెనీ టెర్రా, బ్రహ్మ, ఫారస్ బ్రహ్మ పేరిట పత్తి విత్తనాలను విక్రయిస్తున్నట్లు వివరించారు. ఇచ్చోడలోని రంజిత్ ట్రేడర్స్లో 1190 ప్యాకెట్లు, వాసవి ట్రేడర్స్లో 953, సహారా ఆగ్రో ఏజెన్సీలో 94, మొత్తం 3027 పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వీటి విలువ రూ. 23, 29, 379 ఉంటుందని వివరించారు. తనిఖీలకు ముందు వీటిని కొననుగోలు చేసిన రైతులు వెంటనే వాటిని సంబంధిత దుకాణాల యజమానులకు అప్పగించాలన్నారు. రైతులను మోసం చేస్తున్నట్లు గుర్తించి సదరు కంపెనీ యజమానిపై కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. గుడిహత్నూర్ మండల కేంద్రంలోని శ్రీ సాయి కృష్ణకు చెందిన రెండు ఫర్టిలైజర్ దుకాణాల్లో ఇదే కంపెనీకి చెందిన 99 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ రూ. 75, 933 ఉంటుందన్నారు. సమావేశంలో సీఐ కే రవీందర్, ఎస్ఐ ఫరీద్, సిరికొండ ఎస్ఐ కృష్ణ కుమార్, పోలీస్, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు
నేరడిగొండ, జూన్ 10 : రైతులకు నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని విత్తన టాస్క్ఫోర్స్ అధికారులు భరత్సుమన్, భాస్కర్ హెచ్చరించారు. మండల కేంద్రంలోని విత్తన, ఎరువుల దుకాణాల్లో గురువారం తనిఖీలు నిర్వహించారు. పోలీసులు, విత్తన దుకాణాల యజమానులు పాల్గొన్నారు.
ముత్నూర్లో తనిఖీ
ఇంద్రవెల్లి, జూన్10 : మండలంలోని ముత్నూర్లో విత్తనాల దుకాణాలను ఎస్ఐ నాగ్నాథ్, వ్యవసాయ శాఖ అధికారులు గురువారం తనిఖీ చేశారు. విత్తనాల కొనుగోలు, విక్రయించిన వివరాల నమోదు రికార్డులు పరిశీలించారు. పలు దుకాణాల్లో రికార్డుల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో వ్యాపారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపారులు నకిలీ విత్తనాలు విక్రయించి రైతులకు మోసం చేస్తే దుకాణాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రతి దుకాణం ఎదుట ధరల పట్టిక ఏర్పాటు చేయాలని, కొనుగోలు చేసిన రైతులకు పక్కా రసీదులు అందించాలన్నారు. కార్యక్రమంలో ఏఈవోలు మల్లేశ్, నవతేజ్, ఏఎస్ఐ అశోక్, పోలీస్ సిబ్బంది గణేశ్ పాల్గొన్నారు.
బాదనకుర్తిలో…
ఖానాపూర్ రూరల్,జూన్ 10 : మండలంలోని బాదనకుర్తిలో పరమేశ్వర ఫర్టిలైజర్స్ దుకాణంలో ఏవో ఆసం రవి తనిఖీలు నిర్వహించారు. వ్యాపారులు స్టాక్, బిల్ బుక్కులు సక్రమంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు.