రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): ‘అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పోయింది. ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయడం సాధ్యం కాదని, ఈ పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ 8 నుంచి 10 స్థానాల్లో గెలిచే చాన్స్ ఉన్నదని సర్వే సంస్థలు చెప్తున్నాయి’ అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. సోమవారం సిరిసిల్లలోని తెలంగాణభవన్లో పట్టణ క్లస్టర్ స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరై ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై తీవ్ర వ్యతిరేకత ఉన్నది. సమిష్టిగా కృషి చేస్తే కరీంనగర్ ఎంపీ సీటు మనదే. ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్, బీజేపీ చేసిన మోసాలపై చర్చ పెట్టాలి’ అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఐదేండ్లు ఎంపీగా ఉన్న బండి సంజయ్ కరీంనగర్కు చేసిందేమీ లేదని అన్నారు. జిల్లాకు ఒక్క కళాశాల, పాఠశాలనైనా తీసుకొచ్చారా? ఒక్క గుడి కట్టారా? ఒక్క పరిశ్రమనైనా ఏర్పాటు చేశారా? అని ప్రశ్నించారు. రైతు సమస్యలను కాంగ్రెస్ సర్కారు గాలికి వదిలేసిందని, అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బంధు ఇంతవరకు పూర్తి స్థాయిలో ఇవ్వలేదని, డిసెంబర్ 9న చేస్తానన్న రూ.2 లక్షల రుణమాఫీ నాలుగు నెలలైనా అతీగతి లేదని ధ్వజమెత్తారు.
లోకసభ ఎన్నికల్లో మరోసారి రైతులను మోసం చేసేందుకు ఆగస్టు 15 అంటూ సీఎం రేవంత్రెడ్డి సరికొత్త డ్రామాకు తెరలేపుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్కుమార్ గెలుపుతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చే నెల 10న సిరిసిల్లలో పార్టీ అధినేత కేసీఆర్ రోడ్షో ఉంటుందని తెలిపారు. ప్రతి కార్యకర్త తరలివచ్చి విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. కష్టకాలంలో తన వెంట నిలిచిన కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు, నాయకుల గెలుపు కోసం కష్టపడతానని చెప్పారు. కాంగ్రెస్ కేసులకు భయపడవద్దని, అన్ని విధాలుగా అండగా ఉంటానని స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ జిల్లాధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, ప్రధాన కార్యదర్శి మ్యాన రవి, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, బీఆర్ఎస్ నాయకులు చీటి నర్సింగరావు, టీఎస్టీపీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, బొల్లి రాంమోహన్, కార్యకర్తలు పాల్గొన్నారు.