ఆర్టీసీ కార్గో ద్వారా గోడౌన్లకు రవాణా
6.3 లక్షల పాఠ్యపుస్తకాలకు ప్రతిపాదన
మొదటి విడతగా 60 వేల పుస్తకాలు రాక
వారం రోజుల్లో తరలింపు పూర్తి
ఖమ్మం ఎడ్యుకేషన్, జూన్ 8: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరానికి సంబంధించిన ఉచిత పాఠ్యపుస్తకాలు ఖమ్మం జిల్లాకు చేరుతున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ ఆర్టీసీ కార్గో సర్వీసుల ద్వారా వీటిని రవాణా చేస్తున్నది. రాష్ట్ర విద్యాశాఖ వద్ద పుస్తకాలను అప్లోడ్ చేయడం నుంచి జిల్లాలోని విద్యాశాఖ ప్రభుత్వ గోడౌన్లో దింపే వరకు పూర్తి రక్షణగా ఆర్టీసీ కార్గో సేవలను వినియోగించుకుంటున్నది. నాలుగు విడతల్లో పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరనున్నాయి. మరో వారం రోజుల్లో తరలింపు ప్రక్రియ పూర్తి కానున్నది.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరం బడి తెరిచిన రోజే ఉచిత పాఠ్య పుస్తకాలు అందించేందుకు అవసరమైన చర్యలను విద్యాశాఖాధికారులు చేపడుతున్నారు. ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో చదువుతున్న ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకూ ఉన్న విద్యార్థులందరికీ ఉచితంగా అం దించనున్నారు. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్య పుస్తకాలు ఖమ్మం జిల్లాకు చేరుతున్నాయి. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తే లక్ష్యంగా ముందుకెళ్తున్న తెలంగాణ సర్కార్ ప్రభుత్వ విద్య బలోపేతంలో ఒకింత ముందుగానే ఆలోచన చేస్తోంది. వారం రోజుల్లో జిల్లాకు అవసరమైన పుస్తకాలు పూర్తి స్థాయిలో రానున్నాయి.
ఆర్టీసీ కార్గో ద్వారా రవాణా..
రాష్ట్ర విద్యాశాఖ నుంచి జిల్లాకు పాఠ్యపుస్తకాలు సరఫరా చేసేందుకు టెండర్లు పిలిచి లారీల ద్వారా రవాణా చేసేవారు. ఇప్పుడు ఆర్టీసీ కార్గో సర్వీసుల ద్వారా రవాణా చేస్తున్నారు. రాష్ట్ర విద్యాశాఖ వద్ద పుస్తకాలను అప్లోడ్ చేయడం నుంచి జిల్లాలోని విద్యాశాఖ ప్రభుత్వ గోడౌన్లో దింపే వరకు పూర్తి రక్షణగా ఆర్టీసీ కార్గో సేవలను వినియోగించుకుంటున్నారు. నాలుగు విడతల్లో పాఠ్య పుస్తకాలను జిల్లాకు చేర్చనున్నారు. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ ఉండడంతో కొంత ఆలస్యమవుతుండగా.. మరో వారం రోజుల్లో కార్గో సర్వీసుల ద్వారా పూర్తి స్థాయిలో పుస్తకాలు జిల్లాకు చేరనున్నాయి.
రెండు కోడ్లు..
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందించే ఉచిత పాఠ్యపుస్తకాల్లో రెండు రకాల కోడ్లు ఉన్నాయి. ఒక కోడ్ ఆధారంగా ఏయే పాఠ్య పుస్తకాలు ఏ మండలానికి సరఫరా చేశారో తెలుస్తుంది. మరో క్యూఆర్ కోడ్ ఆధారంగా పాఠ్యపుస్తకంలో పాఠాలను వినేందుకు, చూసేందుకు అవకాశం ఉంటుంది. క్యూఆర్ కోడ్ను ఫోన్లో స్కాన్ చేయగానే ఆయా సబ్జెక్ట్లోని పాఠాన్ని తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోధించిన తరహాలో చిత్రాన్ని వివరించేలా రూపొందించారు. జిల్లా, మండల, పాఠశాలల వారీగా అందిస్తున్న పుస్తకాల వివరాలను, కోడ్ నెంబర్లను నమోదు చేస్తున్నారు. దీంతో పాఠ్య పుస్తకాలు పక్కదారి పట్టకుండా ఫుల్ స్టాప్ పెట్టినట్లయింది. మండలాలకు అందించే పాఠ్యపుస్తకాలనూ జిల్లా కోడ్ల ఆధారంగా ముద్రించారు. దీని వల్ల ఏ కోడ్ నెంబర్ ముద్రించిన పాఠ్యపుస్తకం ఏ పాఠశాలలో పంపిణీ అయిందో ఇట్టే తెలిసిపోతుంది.
6.3లక్షల ప్రతిపాదనలు..
జిల్లాలో అన్ని యాజమాన్యాల పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, కస్తూర్బా, రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్, మైనారిటీ గురుకులాలు, మోడల్ స్కూళ్లు వంటి పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో మొత్తం 1.5 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఆయా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వమే ఏటా ఉచితంగా పాఠ్య పుస్తకాలను అందిస్తోంది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మీడియంతో కలిపి 174 రకాల పుస్తకాలు విద్యార్థులకు అవసరం ఉంటాయి. కాగా 2021-22 విద్యా సంవత్సరానికి గానూ జిల్లాలోని అన్ని పాఠశాలలకు గాను 6,29,000 పుస్తకాలు జిల్లాకు అవసరమని జిల్లా విద్యాశాఖాధికారులు రాష్ట్ర విద్యాశాఖకు ప్రతిపాదనలు పంపారు. విద్యార్థులకు సంబంధించిన డైస్ లెక్కల ఆధారంగా పుస్తకాలు జిల్లాకు కేటాయించనున్నారు. మొదటి విడతగా 60,050 పుస్తకాలు జిల్లాకు చేరాయి. వీటిల్లో 8వ తరగతివి 1,700, 5వ తరగతివి 24,950, 6వ తరగతివి 12,850, 2వ తరగతివి 11,150, 4వ తరగతివి 9,400 పుస్తకాలు గోడౌన్కు చేరాయి.