కరోనా కష్టకాలంలోనూ రుణమాఫీ
రూ.50 వేలలోపు రైతులకు వర్తింపు
ఉమ్మడి జిల్లాలో 1.15 లక్షల మందికి లబ్ధి
15 నుంచి అమలుకు శ్రీకారం
హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు
సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకాలు
మహబూబ్నగర్, ఆగస్టు2(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా కష్టకాలంలోనూ రైతులను ప్రభుత్వం కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నది. ఇందులో భాగంగా వారికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచేందుకు రుణమాఫీ చేయాలని నిర్ణయించింది. గతంలో రూ.25 వేలలోపు తీసుకున్న రుణాలను మాఫీ చేయగా.. తాజాగా రెండో విడుతగా రూ.50 వేలలోపు లోన్లు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఉమ్మడి జిల్లాలో ఉన్న 1.15 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనున్నది. ఈనెల 15 నుంచి అమలుకానుండడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవు తున్నది. దీంతో కర్షకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేస్తున్నారు. అన్నదాతకు అండగా నిలిచిన సర్కార్కు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
కరోనా కష్టకాలంలోనూ అన్నదాతకు అండగా నిలుస్తున్నది టీఆర్ఎస్ సర్కారు. రైతుల సంక్షేమం కోసం తపించే ముఖ్యమంత్రి కేసీఆర్..రైతు రుణమాఫీ ద్వారా అన్నదాతను ఆదుకునేందుకు మరోమారు సిద్ధమయ్యారు. ఇప్పటికే రూ.25వేలలోపు రుణం తీసుకున్న రైతులకు నేరుగా మాఫీ చేసిన సర్కారు ఇప్పుడు రెండో విడుతగా రూ.50వేల లోపు రుణం తీసుకున్న రైతులకు మాఫీ చేసేందుకు నిర్ణయించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమతున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 573074 మంది రైతులు రూ.లక్షలోపు రుణాలు రూ.3102 కోట్లు తీసుకున్నారు. ఇందులో తొలి విడతగా రూ. 25వేలలోపు ఉన్న రైతులు 66,839 మంది నేరుగా రుణ మాఫీ పొందారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5,73,074 మందిలో సుమారు 20 శాతం మంది రైతులు రూ. 50వేలలోపు రుణ మాఫీ పొందే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 1.15 లక్షల మంది రైతులు వరకు రైతులకు రూ. 50వేల లోపు రుణమాఫీ వర్తించే అవకాశాలున్నాయి.
అన్నదాతకు అండగా..
ప్రస్తుతం చేపడుతున్న రెండో విడుతతో కలుపుకొంటే రుణమాఫీ పొందిన రైతుల సంఖ్య సుమారు 1,81,839కు చేరనున్నది. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ అమలుచేస్తున్నది. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేసి మాట నిలబెట్టుకోగా..ప్రస్తుతం కూడా కరోనా కష్టకాలంలోనూ ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఇచ్చిన హామీని నెరవేరుస్తూ సర్కారు అన్నదాతకు అండగా నిలుస్తున్నది. రైతుబంధు కింద పెట్టుబడి సాయాన్ని సకాలంలో అందిస్తూ రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ప్రభుత్వం..ఎరువులు, విత్తనాలను సకాలంలో అందుబాటులో ఉంచింది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఉమ్మడి జిల్లాలో రూ.25 నుంచి రూ.50 వేల లోపు రుణాలున్న 1.15లక్షల మంది చిన్న, సన్నకారు రైతులు లబ్ధిపొందనున్నారు. సర్కారు ఎప్పుడూ తమకు అండగానే ఉంటోందని రైతులు చెబుతున్నారు. రెండో విడుత రుణమాఫీ చేస్తుండటం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మాఫీని సద్వినియోగం చేసుకోవాలి
రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ పథకం అమలు చేస్తున్నది. ఎలాగైనా రుణమాఫీ అవుతున్నదని కొంత మంది రైతులు సకాలంలో తమ రుణాలను రెన్యూవల్ చేయించుకోవడం లేదు. రైతులు తప్పనిసరిగా రుణాలను రెన్యూవల్ చేసుకోవాలి. బ్యాంకు రుణాలు చెల్లించినా రుణమాఫీ తప్పకుండా వర్తిస్తుంది. రైతులు సద్వినియోగం చేసుకోవాలి.