24 గంటల్లోనే ఫలితం
మొదటి రోజు 46 మందికి పరీక్షలు
ఇద్దరు రీసెర్చ్ సైంటిస్టులు, ఎనిమిది మంది సిబ్బంది నియామకం
రోజూ 150 మందికి పరీక్షలు చేసే సామర్థ్యం
ఎదులాపురం, మే 9 : ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా ఇప్పటి వరకు స్వాబ్ తీసి వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్ ఐసీఎం సెంటర్లకు పంపించేవారు. రిజల్ట్ వచ్చే సరికి వారం నుంచి 10 రోజులు పట్టేది. గతేడాది సీబీనాట్, ట్రానాట్ యంత్రాల ద్వారా పరీక్షలు చేశారు. ఒక్కో పరీక్షకు సుమారు రెండు గంటలు సమయం పట్టేది. ప్రస్తుతం కొవిడ్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్న దృష్ట్యా స్థానికంగానే సెంటర్ ఏర్పాటు కోసం సర్కారు చర్యలు తీసుకున్నది. ఈ మేరకు శుక్రవారం ఐసీఎంఆర్ నుంచి అనుమతి వచ్చింది. ఇద్దరు రీసెర్చ్ సైంటిస్టులతోపాటు 8 మంది ల్యాబ్ టెక్నీషియన్లను ప్రభుత్వం నియమించింది. ఇప్పటికే నిర్వహించిన డ్రై రన్ విజయవంతమైంది. ఈ సెంటర్కు రోజుకు 150 మంది స్వాబ్ పరీక్షలు చేస్తామని తెలిపారు. ప్రతి ఆరు గంటల్లో 94 టెస్టులు చేయవచ్చని వివరించారు. రిమ్స్ ఆర్టీపీసీఆర్కు స్వాబ్ అందినప్పటి నుంచి నుంచి 24 గంటలలోపే రిజల్ట్ ఇస్తారు. ప్రసుత్తం ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని పీహెచ్సీలు, రిమ్స్లో చేసిన పరీక్షల నమునాలన్నీ ఈ ల్యాబ్కే రానున్నాయి. శనివారం 46 నమూనాలు రాగా ఇందులో రిమ్స్కు చెందినవి15, జిల్లాలోని వివిధ పీహెచ్సీలకు చెందిన 31 నమూనాలున్నాయి. ఇందుకు సంబంధించిన రిపోర్టులన్నీ ఆదివారమే వచ్చాయి. 16 మందికి పాజిటివ్ రిపోర్టు వచ్చింది.
కొవిడ్ ఆర్టీపీసీఆర్ టెస్టు ఇలా…
రిమ్స్ ఆర్టీపీసీఆర్ ల్యాబ్కు వచ్చిన నిర్ధారణ కోసం వచ్చిన నమూనా (స్వాబ్)ను మొదటగా బయోసేఫ్టీ క్యాబినెట్లో గంటన్నరపాటు పరీక్షించి, ఆ తర్వాత ఆర్ఎన్ఏ మిషన్లలో గంటన్నరపాటు పరీక్షించి చివరగా పీసీఆర్ మిషన్లలో సుమారుగా రెండు గంటల పాటు నమూనా ఉంచిన తర్వాతే పాజిటివ్ లేదా నెగెటివ్ అని నిర్ధారణ అవుతుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు తాత్కాలికంగా ల్యాబ్ను ఏర్పాటు చేశారు. మెడికల్ కళాశాలలోనే పర్మినెంట్ ల్యాబ్ను ఏర్పాటు చేస్తున్నారు. నిర్మాణ పనులు సైతం ప్రారంభమయ్యాయి. ఆర్టీపీసీఆర్ ల్యాబ్లో అన్ని మిషన్లు ఖరీదు విలువ సుమారు రూ.80లక్షలపై ఉంటుంది.