శివాయ విష్ణురూపాయ
శివరూపాయ విష్ణవే
శివస్య హృదయం విష్ణుః
విష్ణోశ్చ హృదయం శివః
**
శివుడే విష్ణువు
విష్ణువే శివుడు
శివుడి హృదయం విష్ణువు
విష్ణువు హృదయం శివుడు
కానీ, విష్ణువును పూజిస్తూ శివుడిని ద్వేషించేవారు; శివుడిని పూజిస్తూ విష్ణువును ద్వేషించేవారు ఇప్పటికీ ఉన్నారు. నిజానికి శివుడు- విష్ణువు ఒకటే. వరుసగా ఒక్కో సందర్భం, ప్రస్తావన చదువుతూ పోతే శివుడిని- విష్ణువును ఎందుకు కలిపి చూడాలో అర్థమవుతుంది.
క్షీరసాగర మథన సందర్భం. వాసుకి మహా సర్పాన్ని మంథర పర్వతానికి తాడుగా చుట్టి దేవదానవులు చెరోవైపు చిలుకుతున్నారు. అమృతం వస్తుందనుకుంటే సమస్త లోకాలను దహించే హాలాహల దావాగ్ని పుట్టింది. అప్పటిదాకా అలాంటి విషంతో కూడిన అగ్నిని ఎవరూ చూడలేదు. దాని వేడికి, ఘాటుకు దేవదానవులు చెట్టుకొకరు పుట్టకొకరు పారిపోయారు. అయినా అది వెంటాడుతూనే ఉంది. చివరకు సర్వేశ్వరుడే గతి అనుకుని కైలాసానికి పరుగెత్తారంతా. ‘స్వామీ! అమృతం కోసం చిలకబోతే విషాగ్ని వచ్చింది. ఆ వచ్చిన అగ్ని సహజంగా చల్లారకపోగా ముల్లోకాలను మాడ్చి మసి చేస్తున్నది. నీవే రక్షించాలి’ అన్నారు. ‘ఏం చేద్దాం?’ అన్నట్లు పార్వతి వైపు చూశాడు శివుడు. ఆమె కండ్లతోనే సమాధానమిచ్చింది. వెంటనే శివుడు హాలాహలానికి ఎదురెళ్లి, దాన్ని పట్టుకుని, అరచేతిలో నలిపి, ఒక చిన్న ఎండు ద్రాక్ష పండులా చేసి నోట్లో వేసుకున్నాడు. పూర్తిగా మింగితే శివుడి కడుపులో లోకాలు కాలి బూడిదైపోతాయి. ఉమ్మితే బయట లోకాలు బూడిదవుతాయి. గొంతు దగ్గర హాలాహలాన్ని అలా నిలిపి ఉంచుకున్నాడు శివుడు. ఆ క్షణం నుంచి ఆయన గరళ కంఠుడు, నీల కంఠుడు అయ్యాడు. ఈ సందర్భంలో శివుడిని అభ్యర్థించడానికి వచ్చినవారిలో నారాయణుడు కూడా ఉన్నాడు. నారాయణుడి సోదరి నారాయణి. ఆ నారాయణి సాక్షాత్తు శివుడి భార్య. అంతకుముందు పాలసముద్రం మీద మంథర పర్వతం చిలకబోతే పట్టుదప్పి ప్రతిసారీ మునిగిపోతుంటే శ్రీ మహావిష్ణువే కూర్మంగా అవతరించి మంథరగిరిని వీపున మోశాడు.
పుట్టపర్తి నారాయణాచార్యులు జన్మతః శ్రీ వైష్ణవుడు. ఈ సరస్వతీ పుత్రుడు రాసిన కావ్యాల్లో ప్రఖ్యాతమైనది ‘శివతాండవం’. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పాడు. శివుడి తాండవానికి, పార్వతి లాస్యానికి తెలుగు మువ్వలు పుట్టపర్తి పదాలు. సంగీత, సాహిత్య, నాట్య, మంత్ర శాస్త్రాల సమ్మిళితం ఈ కావ్యం. చదువుతుంటే సాయం సంధ్యలో నర్తించే శివుడు కండ్ల ముందు కదులుతూ ఉంటాడు.
‘సర్వశ్శర్వశ్శివస్థాణుర్భూతాదిర్నిధిరవ్యయః సమ్భవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః’ అని శివ, కేశవ అభేదాన్ని కీర్తిస్తుంది విష్ణు సహస్రనామాలు. భవిష్యత్తులో విష్ణు సహస్రనామాలు పఠించే ఓపిక, తీరికలేని జనం పుడతారని పార్వతికి ముందే తెలుసు కాబోలు! అందుకే ‘కేనోపాయేన లఘునా విష్ణోర్నామసహస్రకమ్; పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో!’ అని పరమేశ్వరుడిని అడుగుతుంది. అప్పుడు శివుడు ‘శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే; సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే!’ అని తారకమంత్రం ఉపదేశిస్తాడు. మనం పఠిస్తున్న శివ సహస్రనామాలను మొట్టమొదట కొన్నేండ్లు తపస్సుగా పూజ చేసినవాడు శ్రీహరే. నిత్యం మనం పఠించే రామతారక మంత్రాన్ని మొదటిసారి పార్వతికి ఉపదేశించినది హరుడే. అంతేకాదు, ఆ మహావిష్ణువు రాముడిగా అవతరిస్తే.. ఆయనకు సహకరించడానికి పరమేశ్వరుడు హనుమగా జన్మించాడు.
పాల్కురికి సోమనాథుడితో వాదనకు దిగిన చక్రపాణి రంగనాథుడు మొదట విష్ణు భక్తుడు. శివ ద్వేషి. శ్రీశైలం మీదుగా వెళ్తూ శివుడిని చూడాల్సి వస్తుందని కండ్లు మూసుకుంటాడు. తర్వాత ఎంత ప్రయత్నించినా కండ్లు తెరుచుకోవు. తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో శ్రీశైలం మల్లన్నను ప్రార్థిస్తే ఒక కన్ను వస్తుంది. పాల్కురికి క్షమాపణలు చెప్పడంతో రెండో కన్ను కూడా వస్తుంది. అప్పుడు రంగనాథుడు శివభక్తి పారవశ్యంతో రాసినదే ‘నయన రగడ’ కావ్యం.
‘శ్రీ పార్వతీశుఁ జూడక
పాపాత్ముఁడ నగుచుఁ బోవఁ బథమునఁ జక్షుల్
దీపించు దృష్టి తొలఁగిన
శ్రీపతి నడుగంగఁ గర్త శివుఁడని చెప్పెన్
నయముగా నయనములు నా కీయ బొడగంటి
భయభక్తు లీ భర్గు పాదములు పొడగంటి
శ్రీశైల వల్లభుని శిఖరంబుఁ బొడగంటి
కాశీ పురాధీశు గౌరీశుఁ బొడగంటి
సర్వలోకేశ్వరుని సర్వేశుఁ బొడగంటి
సర్వసంరక్షకుని సర్వంబుఁ బొడగంటి
పరమాత్ము నీశానుఁ బరమేశుఁ బొడగంటి’
కంటి కంటి అన్న మకుటంతో సాగే ఈ నయన రగడ ప్రభావంతోనే తర్వాతి వాడయిన అన్నమయ్య ‘కంటి నఖిలాండ కర్తనధికుని గంటి.. కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి’ అని వెంకన్నకు పదకవితా పుష్పం సమర్పించాడు.
ఇష్టదేవతారాధనకు శాస్త్రమే అనుమతించింది. మధ్యలో ఇష్టదైవాన్ని పెట్టి, నాలుగు వైపులా మిగతావారిని పెట్టుకునే పంచాయతన పూజా విధానాన్ని శంకరాచార్యులు వేద ప్రమాణంతోనే స్థిరపరిచారు. ఈ పంచాయతనంలో శివుడు, విష్ణువు, అమ్మవారు, గణపతి, సూర్యుడు ఉంటారు.
పశుల వన్నె వేరు పాలేక వర్ణమౌ
పుష్పజాతి వేరు పూజ ఒకటి
దర్శనములు వేరు దైవంబు ఒక్కటి
విశ్వదాభిరామ వినుర వేమా!
దైవం ఒకటే అని వేమన అరటిపండు వలిచిపెట్టినట్లు చెప్పాడు. భక్తిలో ద్వేషానికి తావు లేదు. ద్వేషంతో సాధించే మార్గం భక్తి కానే కాదు. ఇది తెలియనివారికి భక్తికి నిర్వచనం తెలియనట్లు. తెలిసినవారు భక్తిమార్గంలో ఉన్నట్లు.
– పమిడికాల్వ మధుసూదన్
ఈ కొత్త సంవత్సరంలో శని ఏ రాశిలో ఉంటాడు? రాహు కేతువుల సంచారం ఎలా ఉంటుంది?
జపం చేసేటప్పుడు జపమాలను చూపుడు వేలుతో ఎందుకు తిప్పకూడదు?